– విదేశీ ప్రభుత్వాలకు వివరించేందుకు మాత్రం ఓకే
– పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై కేంద్రం తీరు
– ఇప్పటికే అఖిలపక్ష ఎంపీలతో ప్రతినిధి బృందాలు.. పలు దేశాల్లో పర్యటనలు
– సభను సమావేశపర్చాలని ప్రతిపక్ష పార్టీల డిమాండ్
– 1962, 1971 యుద్ధ సమయాల్లో సభకు ప్రతిదీ వివరించిన అప్పటి ప్రభుత్వాలు
– ఏదీ పట్టించుకోని మోడీ సర్కారు.. అఖిలపక్ష సమావేశాలకూ డుమ్మా
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరగటం, ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించటం అనూహ్యంగా జరిగిపోయాయి. ఈ విషయంలో పార్లమెంటును సమావేశపర్చాలని భారత్లోని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. మోడీ సర్కారు మాత్రం వెనుకడుగు వేస్తున్నది. ఉగ్రవాదం విషయంలో పాక్ తీరుకు వ్యతిరేకంగా పలు దేశాలోల పర్యటించి అక్కడి ప్రభుత్వాలకు తెలియజేసేలా మోడీ సర్కారు అఖిలపక్ష ఎంపీలతో ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. ఇతర దేశాలకు వివరించటానికి సిద్ధపడిన సర్కారు… పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకూ వివరించటానికి ఎందుకు వెనుకాడుతోందని ప్రతిపక్ష నాయకులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర.. వంటి అంశాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పట్టుబడుతోన్నాయి. ఈ విషయాలపై చర్చించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే, మోడీ సర్కారు మాత్రం ఇవేమీ పట్టించుకోవటం లేదు. ప్రతిగా… ఉగ్రవాదం విషయంలో పాక్ తీరు, ఆ దేశం చేస్తున్న ప్రచారం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరించే విధానం, జాతీయ ఐక్యతను ఐక్యరాజ్య సమితి (యూఎన్)తో పాటు ఇతర దేశాల ముందు ఉంచటానికి తయారైంది. ఇందులో భాగంగా పలుపార్టీల ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసిన దేశాలకు పంపి అక్కడి ప్రతినిధులతో సమావేశమై పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకీకృత జాతీయ వైఖరిని ప్రదర్శించేలా ప్రణాళికను తయారు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు బృందాలు తమ కార్యాచరణను మొదలు పెట్టాయి. పార్లమెంటును అంధకారంలో ఉంచి… ఇతర దేశాల ప్రభుత్వాలకు వివరణ ఇవ్వాలనే మోడీ సర్కారు తీరును ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఎత్తి చూపుతున్నారు. ప్రధాని మోడీ.. పార్లమెంటు వేదికగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు.
ఆ రెండు యుద్ధాలలో ఇలా..
గతంలో రెండు యుద్ధాల సమయంలో అప్పటి ప్రభుత్వాలు పార్లమెంటును పరిగణలోకి తీసుకున్నా యి. 1971లో పార్లమెంటు అప్పటికే సమావేశమైంది. యుద్ధానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు అప్పటి ప్రభుత్వం సభకు తెలియజేసింది. 1962లోనూ పార్లమెంటు రహస్య సమావేశం ఏర్పాటుకు అప్పటి నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, ఇందులో దాచటానికి ఏమీ ఉండదనీ, ప్రతిదీ సభ ముందు బహిరంగంగానే ఉంచుతామని నెహ్రూ వెల్లడించారు. ఇక యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో 2008లో ముంబయిలో ఉగ్రదాడి తర్వాత వెంటనే శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏం జరిగింది, భారత్ ఏం చేసింది అన్నది పార్లమెంటుకు తెలియజేయాలి. కానీ, అలాంటి నిబంధనలేవీ లేవు. పార్లమెంటును పరిగణలోకి తీసుకోవాలా, వద్దా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ పి.డి.టి ఆచారి తెలిపారు. ముంబయిలో 2008లో ఉగ్రదాడి, 2001లో పార్లమెంటుపై దాడి, కాశ్మీర్లో పెరుగుతున్న హింస తర్వాత 1994లో యూఎన్హెచ్ఆర్సీకి పలు పార్టీల బృందాన్ని పంపటం విషయాల్లో గతంలో పార్లమెంటులో తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడటం గమనార్హం.
ప్రజలను కాదని విదేశీ ప్రభుత్వాలకు తెలియజేయటమా..? : సీపీఐ
భారత్లోని ప్రజలకు కాకుండా.. విదేశాల్లోని ప్రభుత్వాలకు విషయాలను తెలియజేయాలన్న తీరు సరికాదని పలు ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ”ఆపరేషన్ సిందూర్ తర్వాత యూఎన్ఎస్సీ సభ్యులు సహా కీలక దేశాలకు అఖిలపక్ష ప్రతినిధులను పంపాలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం… పార్లమెంటును, ప్రజల్ని మాత్రం మినహాయించింది. దేశంలోని ప్రజలే అంధకారంలో ఉన్నపుడు విదేశీ ప్రభుత్వాలకు వివరించటం ఆమోదయోగ్యం కాదు” అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. కాల్పుల విరమణ నిబంధనలపై పెరుగుతున్న గందరగోళం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్రపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రపంచానికి చెప్పటానికి ముందు ప్రభుత్వం మొదట తన సొంత ప్రజలను, సంస్థలను గౌరవించాలని అన్నారు.
ప్రజల దృష్టిని మరల్చే చర్యలు : కాంగ్రెస్
పలుపార్టీల ఎంపీలను యూఎన్కు పంపే గత సాంప్రదాయాన్ని ఆపేసిన మోడీ.. ఇప్పుడు మాత్రం తన స్వార్థం కోసం, ప్రజల దృష్టిని మరల్చే ందుకు మళ్లీ ఆ సాంప్రదాయాన్ని ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ఆరోపించారు. ”1950ల నుంచి వివిధ రాజకీయ పార్టీల ఎంపీలను ప్రతీ అక్టోబర్ లేదా నవంబర్లో యూఎన్కు ప్రతినిధి బృందాలుగా పంపుతున్నారు. 2014లో మోడీ ఈ విధానానికి స్వస్తి పలికారు. ఇప్పుడు తన ఇమేజ్ దెబ్బతినటం, ఎదురువు తున్న ప్రశ్నల నేపథ్య ంలో ప్రజల దృష్టిని మరల్చటానికి అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని వివిధ దేశాలకు పంపటానికి నిర్ణయించారు” అని ఆయన తెలిపారు. 2008 ఉగ్రదాడి విషయంలో ముష్కరులను మట్టుబెట్టి, ఒకరిని పట్టుకున్నామనీ, పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు ఇప్పటికీ పరారీలో ఉన్నారని జైరాం రమేశ్ అన్నారు. వారిని అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు.
భయమెందుకు?
ఉగ్రదాడుల తర్వాత పార్లమెంటు సమావేశాల ను నిర్వహించాలా? వద్దా అనేది కేంద్రం నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే, గతంలో చోటు చేసుకున్న యుద్ధాలు, ఉగ్రదాడుల సమయం లో, ఆ తర్వాత గత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పార్లమెంటుకు వివరాలను తెలియజేయటమో, కొన్ని రోజుల తర్వాతైనా సమావేశాలు ఏర్పర్చటమో చేశాయి. 1962, 1971 రెండు యుద్ధ సమయాల లో కేంద్రంలోని అప్పటి ప్రభుత్వాలు ఈ విధంగానే చేశాయి. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం పార్లమెంటును సమావేశపర్చే విషయంలో సరిగ్గా స్పందించటం లేదు. ముఖ్యంగా, భారతదేశ సార్వభౌ మత్వాన్ని ప్రశ్నించేలా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాల నుంచి అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలోనూ అమెరికా అధ్యక్షుడి ముందు మోడీ మోకరిల్లాడా అని ప్రశ్నిస్తున్నాయి. లేదంటే సభను సమావేశపర్చటానికి మోడీ ఎందుకు భయపడుతున్నారని అంటున్నాయి.
అఖిలపక్ష సమావేశాలకూ హాజరుకాని ప్రధాని
పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రం రెండు అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి ఉగ్రదాడి తర్వాత, ఇంకొకటి ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగాయి. వీటికి ప్రధాని మోడీ మాత్రం హాజరు కాలేదు. అయితే, బీహార్లోని ఒక ర్యాలీలో భాగంగా మోడీ పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. అలాగే, ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశాన్ని ఉద్దేశించి ఒకసారి ఆయన ప్రసంగించారు. భారత్-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందన్న డోనాల్డ్ ట్రంప్ ట్వీట్, తాను మధ్యవర్త్తిత్వం వహించానని ట్రంప్ చేసిన ప్రకటనలు ప్రజాస్వామ్యవాదులకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇది దేశసార్వభౌమత్వంలోకి చొరబడటమేనని ఆరోపించాయి. అయితే, ట్రంప్ ఆ విధంగా చెప్పిన తర్వాత రెండు రోజులకు మోడీ బయటకు వచ్చారు. అయితే, కాల్పుల విరమణ, ట్రంప్ జోక్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన నుంచి ఎలాంటి స్పష్టతా రాకపోవటం గమనార్హం.
పార్లమెంటుకు నో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES