మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ఎందుకు పిలవడం లేదు?
బనకచర్లపై కేంద్రానికి రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి లేఖ రాయాలి
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ మహాధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయించిందని, మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ఎందుకు పిలవడం లేదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ప్రశ్నించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఆమె మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదన్నారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి.. 90 శాతం పనులను మెఘా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చారని అన్నారు. అదే మెఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్హౌజ్ పనులు చేశారనీ, ఆయన్ను కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.
90 శాతం పంప్హౌజ్ల పనులు చేసిన కాంట్రాక్టర్ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ఆ ప్రాజెక్టు కట్టిందే దాదాపు రూ.80,000 కోట్లతో అని తెలిపారు.ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీటి తరలింపును తక్షణమే అడ్డుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమీ తేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీలో ఉన్న ఒకే ఒక్క తెలంగాణ ఉద్యమ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయమన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకోవాలని కోరారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? వీటన్నింటితో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని స్పష్టమైంది” అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు దాస్యం విజయభాస్కర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీధర్రావు, యువజన రాష్ట్ర అధ్యక్షులు సంపత్గౌడ్, మహిళా రాష్ట్ర అధ్యక్షులు మరిపెల్లి మాధవి, విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు రాము యాదవ్, జాగృతి నాయకులు అప్పాల నరేందర్ యాదవ్, జాగృతి ఇటలీ అధ్యక్షులు తానింకి కిషోర్ యాదవ్, పబ్బోజు విజేందర్, ఈగ సంతోష్, అర్చన సేనాపతి, మాడ హరీశ్ రెడ్డి, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES