నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణను రద్దు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్పై ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనుంది.
కాగా నిధుల ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే సీబీఐ కేసు నడిపిందని, కుట్ర కోణం రుజువు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ ఫిబ్రవరి 2026లో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్, సిసోడియా, కవితలతో పాటు మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విడుదల చేసింది.



