నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో భాగంగా స్పౌజ్ కేటగిరీ కింద 71, 380 మందికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు.
సామాజిక భద్రత పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే… అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పింఛను అందించేలా స్పౌజ్ కేటగిరీని ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించి స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో 71, 380 మందిని అర్హులుగా తేల్చింది.
ఇప్పుడు కొత్త పింఛను మంజూరైన 71, 380 మందికి నెలకు రూ. 4 వేల చొప్పున పింఛన్లు ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది.
అర్హురాలైన మహిళ తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం, తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాలి. నెలాఖరులోపు ఈ వివరాలతో సంప్రదిస్తే వారికి మరుసటి నెలలో పింఛన్ సొమ్ము అందిస్తారు.