నవతెలంగాణ-హైదరాబాద్: ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు బ్లాక్మెయిల్ చాలా కాలంగా కొనసాగుతోంది. కానీ మేము దానిని సహించమని ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ పాక్ కు హెచ్చరికలు జారీ చేశాడు. రక్తం, నీరు కలిసి ప్రవహించకూడదని భారతదేశం నిర్ణయించుకుందని అన్నారు. భారత నదుల నీరు శత్రువులకు సాగునీరు ఇస్తోంది. ఇప్పుడు భారత్ తన వాటా నీటిని పొందుతుంది. భారతదేశ రైతులకు దానిపై హక్కు ఉందని” తెలిపారు.
ఈరోజు ఎర్రకోట నుంచి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ధైర్య సైనికులకు సెల్యూట్ చేసే అవకాశం నాకు లభించింది. మన ధైర్య సైనికులు శత్రువులను వారి ఊహకు అందకుండా శిక్షించారు. సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్లో టూరిస్టులను ఊచకోత కోసిన విధానం. వారి మతాన్ని అడిగి చంపిన తీరు. భర్తను అతని భార్య ముందు కాల్చి చంపారు, తండ్రిని అతని పిల్లల ముందు చంపారు. దీంతో భారత్ మొత్తం ఆపరేషన్ సిందూర్తో పాక్ కు తగిన బుద్ది చెప్పిందని ఆయన తెలియజేశారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి వరుసగా 12వసారి ప్రసంగం చేశారు. ఈ సంవత్సరం థీమ్ ‘న్యూ ఇండియా’. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రణాళిక, అమలులో పాల్గొన్న సీనియర్ సైనిక అధికారులను 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్కరించారు.