– అమ్మకాల్లోనూ భారీ పతనం
బెంగళూరు: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.870 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.416 కోట్ల నష్టాలతో పోల్చితే రెట్టింపు పైగా పెరగడం గమనార్హం. గడిచిన క్యూ4లో కంపెనీ రెవెన్యూ కూడా 59.48 శాతం క్షీణించి రూ.611 కోట్లకు పరిమితమయ్యింది. 2023-24 ఇదే క్యూ4లో ఏకంగా రూ.1,508 కోట్ల రెవెన్యూ సాధించింది. 2024-25లో మొత్తంగా రూ.4,645 కోట్ల రెవెన్యూ నమోదు చేయగా.. ఇంతక్రితం ఏడాదిలో ఏకంగా రూ.5,126 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. క్రితం క్యూ4లో కంపెనీ అమ్మకాలు 51,375 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023-24 ఇదే త్రైమాసికంలో 1.15 లక్షల యూనిట్ల అమ్మకాలు చేసింది. ద్విచక్ర ఇవి అమ్మకాల్లో గతేడాది వరకు నెంబర్ వన్గా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల మార్కెట్ వాటాలో మూడో స్థానానికి పడిపోయింది. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో ప్రథమ, ద్వితీయ స్థానాల్లోకి వచ్చాయి.
ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు రెట్టింపు
- Advertisement -
- Advertisement -