– నిల్వ ఉన్న లిక్కర్ ధర పెంచి విక్రయాలు
– ధరల పెంపునకు ముందే సరుకు కొనుగోలు
– చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆదివారం సాయంత్రం మల్లాపూర్ సమీపంలో ఉన్న ఓ వైన్స్ నుంచి ఓ వ్యక్తి ప్రీమియం లిక్కర్ హాఫ్ కొనుగోలు చేశాడు. ఆ బాటిల్పై ఎమ్మార్పీ రూ.660 ఉంది. వైన్స్లో రూ.680 తీసుకున్నారు. రూ.20 ఎక్కువగా ఎందుకు వసూలు చేశారని అతను ప్రశ్నించగా.. ప్రభుత్వం రేట్లు పెంచిందని దుకాణదారుడి నుంచి సమాధానం వచ్చింది. పెంచితే ఎమ్మార్పీ ఉండాలి కదా..? అని తిరిగి ప్రశ్నించాడు. కొత్త స్టాక్పై ఆ రేటు వస్తుందని.. ఇది పాత స్టాక్ అని వైన్స్ దుకాణదారుడి నుంచి సమాధానం వచ్చింది.
వారం కిందటే పెరిగిన రేట్లు
ఫిబ్రవరిలో బీర్ల ధరలను 15 శాతం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. వారం రోజుల కిందట లిక్కర్ ధరలను కూడా పెంచింది. తాజాగా ఫుల్బాటిల్పై రూ.40, హాఫ్ బాటిల్పై రూ.20, క్వార్టర్పై రూ.10 చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే, కొందరు వైన్స్ యజమానులు పాత స్టాక్పై కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు. నిల్వ ఉన్న స్టాక్పై అడ్డగోలుగా రేట్లు పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సగానికిపైగా వైన్స్లలో ఇదే దందా సాగుతోంది. రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణ ప్రాంతాల్లో ఇదే వ్యవహారం నడుస్తోంది. కొంత మంది బాటిళ్లపై ఉన్న ఎమ్మార్పీ గురించి ప్రశ్నిస్తే.. ప్రభుత్వం పెంచినప్పటి నుంచి ఆ ధరలు ఆటోమెటిక్గా అమల్లోకి వచ్చాయని చెబుతున్నారు. కొన్నిచోట్ల మద్యం ప్రియులు వైన్స్ యజమానులతో వాగ్వాదానికి దిగుతుండగా.. మరి కొంతమంది లైట్ తీసుకుంటున్నారు.
ఫుల్ స్టాక్ కొనుగోలు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19 నుంచి మద్యం ధరలను పెంచేసింది. అయితే, ఈ సమాచారం మద్యం వ్యాపారులకు ముందుగానే లీక్ అయినట్టు సమాచారం. దీంతో వారు అన్ని రకాల లిక్కర్ బాటిళ్ల స్టాక్ను ముందస్తుగా ఫుల్గా కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. ధర పెరిగాక పాత లిక్కర్ బాటిళ్లను కొత్త ధరతో అమ్ముతూ దండిగా మందు బాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు.
ప్రేక్షక పాత్రలో ఎక్సైజ్ శాఖ
సాధారణంగా మద్యం ధరలను ప్రభుత్వం పెంచిన తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు పాత స్టాక్ విషయంలో నిర్ణయాత్మక పాత్ర వహించాలి. ప్రతి వైన్స్లో ఎంత మేరకు పాత స్టాక్ ఉందనేది పరిశీలన చేయాల్సి ఉంటుంది. నిల్వ ఉన్న లిక్కర్ను పాత ధరలోనే విక్రయించేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. కొత్త స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ ఎమ్మార్పీకి అనుగుణంగా విక్రయాలు జరిగేలా చూడాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని కొన్ని వైన్స్లలో పాత స్టాక్ను బహిరంగంగా కొత్త ధరలతో అమ్ముతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
కొరవడిన నిఘా..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో గుట్కా, సిగరెట్, బెల్ట్షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎక్కువగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రసూననగర్, షాపూర్నగర్, గండిమైసమ్మ, సుచిత్ర, పద్మానగర్ రింగ్ రోడ్డు, కొంపల్లి, రొమేస్త్రీ నగర్, భగత్సింగ్ నగర్, తదితర ప్రాంతాలు అడ్డాలుగా మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట, ఘట్కేసర్, మేడ్చల్ మండలాల్లో అక్కడక్కడా అడ్డాలు ఉన్నట్టు తెలుస్తోంది. గుట్కా, సిగరెట్, బెల్ట్షాపుల్లో మద్యం ఇష్టానుసారంగా విక్రయిస్తున్నా.. సంబంధిత శాఖ అధికారులు అటు వైపు కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల నిఘా కొరవడంతోనే ఇదంతా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
పాత స్టాక్.. కొత్త రేటు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES