న్యూఢిల్లీ: కీలకమైన రక్షణ వ్యవస్థలు, ఆయుధాల విషయంలో జరుగుతున్న జాప్యాల పట్ల భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తయినట్టు తనకు గుర్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న సీఐఐ బిజినెస్ సదస్సులో మాట్లాడుతూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రక్షణ శాఖ ప్రాజెక్టుల విషయంలో టైమ్లైన్ చాలా కీలకమని అన్నారు. ‘మనం సాధించలేనిదాని గురించి మనం హామీలివ్వడం ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టులపై సంతకాలైతే జరిగిపోతాయి, కానీ ఆయుధాలేవీ సకాలంలో చేతికి అందవని ఆయన ఘాటుగా స్పందించారు. ”ఆ కాంట్రాక్టులపై సంతకాలు చేస్తున్నపుడే సకాలంలో అందేవి కావని అర్ధమైపోతూ వుంటుంది. ఆ తర్వాత ఏం చేద్దామా అని ఆలోచిస్తూ వుంటాం, ఇక చెప్పేదేముంది, మొత్తంగా ప్రక్రియ అంతా నాశనమవడం తప్ప” అని ఆయన వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో 2021లో జరిగిన కాంట్రాక్టునుద్దేశించి సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తేలికపాటి యుద్ధ విమానాలైన 83 తేజస్ ఎంకె 1ఎ విమానాలను అందచేయడంలో జరిగిన జాప్యాన్ని ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అలాగే మౌలికమైన శిక్షణకు ఉపయోగించే శిక్షణా విమానాలు హెచ్టిటి-40లను 70 విమానాలు కోసం కూడా హెచ్ఏఎల్తో ఐఎఎఫ్ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ ఏడాది సెప్టెంబరు కల్లా వాటిని ఐఎఎఫ్లో చేర్చుకోవాల్సి వుంది.
దేశీయ తయారీపై దృష్టి పెట్టాలి
వైమానిక దళ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ సింగ్, అవి లేకుండా ఏ ఆపరేషన్ కూడా పూర్తి కాదన్నారు. ఆపరేషన్ సిందూర్ దీనికి చక్కని ఉదాహరణ అని చెప్పారు. దేశంలో తయారుచేయడం, సమకూర్చుకోవడం గురించి కేవలం మాట్లాడుకుంటే సరిపోదు, భారత్లో వాటి రూపకల్పనను అభివృద్ధిపరుచుకోవడాన్ని ప్రారంభించాల్సిన అవసరం వుందన్నారు.
సైన్యానికి, పరిశ్రమలకు మధ్య సరైన కమ్యూనికేషన్ వుండాలని, విశ్వాసం నెలకొనాల్సిన అవసరం వుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించినంతవరకు ఐఎఎఫ్ గరిష్ట స్థాయిలో సాధ్యమైనంతగా కృషి జరపాలని అన్నారు. స్వావలంబన ఒక్కటే ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధం కావాలంటే మనం ఇప్పుడు సంసిద్ధులుగా వుండాల్సిన అవసరం వుందని ఆయన నొక్కి చెప్పారు. భారత పరిశ్రమల నుండి, డిఆర్డిఓ నుండి రాబోయే పదేళ్ళలో మరింత రావాల్సి వుందని ఆయన ఆకాంక్షించారు. ఈ రోజు అవసరమున్నది ఈ రోజే తీరాలన్నారు.
పీఓకేలోని ప్రజలు మనవాళ్ళే !
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గురించి వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్లో అంతర్భాగమని, అందులో నివసించే వారు మన కుటుంబంలో భాగమేనని అన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా వారు మన నుంచి విడిపోయినా ఏదో ఒకనాటికి కచ్చితంగా వారు భారత్ ప్రధాన స్రవంతిలో కలుస్తారని, వారంతట వారే వస్తారని, ఆ నమ్మకం మనకుందని మంత్రి పేర్కొన్నారు. అక్కడున్న వారిలో చాలామందికి భారత్తో సంబంధాలున్నాయన్నారు. కొద్దిమంది మాత్రమే దారి తప్పారన్నారు. ఆపరేషన్ సిందూర్తో మన సైనిక పాటవాన్ని శత్రువుకు రుచి చూపించాం, దీంతో మేక్ ఇన్ ఇండియా దేశ భద్రతకు ఎంత ముఖ్యమో స్పష్టమైందన్నారు. నూతన తరం సాంకేతికతలను సముపార్జించుకోవడంపైనా ప్రస్తుతం దృష్టి పెట్టామని చెప్పారు.
కాంట్రాక్టులపై సంతకాలే.. ఆయుధాలు అందవు!

- Advertisement -
- Advertisement -