Friday, June 20, 2025
E-PAPER
Homeజాతీయం'ఆపరేషన్‌ సింధు'

‘ఆపరేషన్‌ సింధు’

- Advertisement -

– ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరిన భారతీయ విద్యార్థులు
– ఇజ్రాయిల్‌ నుంచి కూడా రప్పించడానికి చర్యలు
న్యూఢిల్లీ:
ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోన్న వేళ, ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడానికి కేంద్రం ‘ఆపరేషన్‌ సింధు’ ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ ఆపరేషన్‌లో భాగంగా 110మంది విద్యార్థులు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. తొలిదశలో భాగంగా వీరిని కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. బుధవారం ఆర్మేనియా రాజధాని యెరవాన్‌ నుంచి విద్యార్థులంతా ప్రత్యేక విమానంలో బయలుదేరారు. తాజాగా గురువారం తెల్లవారుజామున వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌కు తిరిగివచ్చిన 110మందిలో 94మంది జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. స్వదేశానికి తిరిగి రావడంపై విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, భారత విదేశాంగ శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో మిగిలిన భారతీయులను కూడా త్వరలోనే తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో తమ పిల్లల రాక కోసం అతృతగా వేచి చూస్తున్న తల్లిదండ్రులు, వారిని వారి రాష్ట్రాలకు పంపడానికి వచ్చిన అధికారులు, ఎస్కార్టులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
ఈ రోజే మరో విమానం పంపిస్తున్నాం
మిగిలిన వారిని కూడా రప్పించేందుకు మరో విమానాన్ని ఈ రోజే పంపిస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ తెలిపారు. కొంతమందిని తుర్కెమినిస్తాన్‌ నుండి తరలిస్తున్నట్లు చెప్పారు. 24గంటలూ తమ కార్యాలయాలు పనిచేస్తాయని, ఎవరైనా ఎలాంటి అభ్యర్ధన కోసమైనా సంప్రదించవచ్చని చెప్పారు. అవసరమైతే మరిన్ని విమానాలు పంపిస్తామనిచెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌ విద్యార్ధుల అసంతృప్తి
ఇదిలా వుండగా స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులపై అసంతప్తి వ్యక్తం చేశారు. వారు విమానాశ్రయం నుండి బయటకు రావడానికి కూడా నిరాకరించారు. వారిలో ఒక విద్యార్ధి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తాము ప్రయాణాలు చేస్తూనే వున్నామని, ఇటువంటి పరిస్థితుల్లో శ్రీనగర్‌కు మళ్లీ బస్సు ప్రయాణమంటే మరో సుదీర్ఘమైన, క్లిష్టతరమైన ప్రయాణమే అవుతుందని, ఇది అమోదయోగ్యం కాదని అన్నారు. దీనికి బదులుగా విమానం ఏర్పాటు చేయాల్సిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ దాడులతో టెహరాన్‌ నగరం దద్దరిల్లుతున్న నేపథ్యంలో అక్కడి భారత ఎంబసీ ఇప్పటికే భారతీయులందరూ నగరాన్ని వీడాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -