నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి..మీడియా పాయింట్ వద్ద ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశంలో పలు కీలక రంగాల్లో అనేక ఉన్నతిని సాధించిందని, ఆపరేషన్ సిందూర్తో ఇండియా ఆర్మీ సామర్థ్యం ప్రపంచదేశాలకు తెలియజేసిందన్నారు. కేవలం 22 నిమిషాల్లో శ్రతు స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తుండటం శుభ పరిణామమని ప్రధాని మోడీ అన్నారు.
పహల్గాం ఉగ్ర దాడి యావత్ ప్రపంచం చూసిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా దేశ హితం కోసం పలు పార్టీలు, పలు రాష్ట్రాల ప్రతినిధులు పలు దేశాల్లో పర్యటించి పాక్ ఉగ్రవాదంపై విస్తృతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలకు ప్రధాని ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.
అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. భారత సైనిక పాటవాలను శుభాంశు శుక్లా రూపంలో ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయని కొనియాడారు.
ఉగ్రవాదం , నక్సలిజం దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నాయని అన్నారు. ఇక నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నామని తెలిపారు. దేశంలో వందలాది జిల్లాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయని అన్నారు. గతంలో రెడ్ కారిడార్లు గా చెప్పుకున్న ప్రాంతాలు గ్రీన్ గ్రోత్ జోన్లలోకి వస్తున్నాయని తెలిపారు.
నేడు ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు. 25 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని అన్నారు. దేశంలో ఒకప్పుడు రెండంకెల స్థాయిలో ద్రవ్యోల్బణం ఉంటే.. నేడు అది 2 శాతానికి పడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.