Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసకాలంలో ఆర్డర్లు పూర్తి చేయాలి..

సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయాలి..

- Advertisement -

– ఆగస్టు 15నాటికి చీరల పంపిణీ లక్ష్యం
– జూన్‌ చివరకు 50శాతం ఉత్పత్తి పూర్తి చేయాలి
– అదనపు ఆర్డర్లతో కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి హామీ
– సొసైటీలు లక్ష్యాన్ని చేరకపోతే ఆర్డర్లు రద్దు చేస్తాం : ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌
– ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తిపై ఉన్నతస్థాయి సమీక్ష
నవతెలంగాణ – సిరిసిల్ల

ఇందిరామహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్‌ను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చేనేత, జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌ అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల ఉపాధి కల్పనకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చీరల ఉత్పత్తి పురోగతిపై సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి మ్యాక్స్‌ సంఘాల సభ్యులు, ఆసాములతో వారు సమీక్ష నిర్వహించారు.
ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమ కార్మికులకు 8నెలలపాటు ఉపాధి కల్పించే ఇందిరా మహిళా శక్తి ఆర్డర్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన 4నెలలు కూడా ఉపాధి లభించేలా ఇతర ప్రభుత్వ శాఖల నుంచి పెద్దఎత్తున ఆర్డర్లు ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఆర్డర్లను సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సిరిసిల్లలోని 131మ్యాక్స్‌ సొసైటీల పరిధిలోని 16,424 పవర్‌లూమ్స్‌కు 4కోట్ల 30లక్షల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్‌ను జనవరి, మార్చి నెలల్లో రెండు దశల్లో అందించామని వివరించారు. మొదటి దశలో 2 కోట్ల 12 లక్షల మీటర్ల ఆర్డర్‌కు ఇప్పటివరకు 50 లక్షల 55 వేల మీటర్ల ఉత్పత్తి మాత్రమే పూర్తైందని తెలిపారు.
ఆగస్టు 15 నుంచి చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందువల్ల ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేయాలని మ్యాక్స్‌ సంఘాల సభ్యులకు సూచించారు. 45 రోజుల గడువులో 3.5 కోట్ల మీటర్ల చీర ఉత్పత్తి చేయాలని, ప్రతి సొసైటీ పరిధిలోని పవర్‌లూమ్స్‌ పూర్తి స్థాయిలో, రోజుకు రెండు షిఫ్టుల్లో పని చేయాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. పాత బకాయిలను దాదాపు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేశామని, పాఠశాల, అంగన్‌వాడీ ఏకరూప దుస్తుల ఆర్డర్లతోపాటు దేవాదాయ శాఖ నుంచి కూడా త్వరలో మరో ఆర్డర్‌ వస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం అందించే ఆర్డర్‌ దాదాపు సంవత్సరానికి 9కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి సొసైటీకీ కేటాయించిన లక్ష్యంలో కనీసం 50శాతం జూన్‌ చివరి వరకు పూర్తి చేయాలని, లేనిపక్షంలో సంబంధిత సొసైటీ ఆర్డర్‌ను రద్దు చేసి, 50శాతం పూర్తి చేసిన సొసైటీలకు ఆ ఆర్డర్‌ను అందిస్తామని హెచ్చరించారు.

టెక్స్‌టైల్స్‌ పార్క్‌ యజమానులతో సమావేశం
టెక్స్‌టైల్స్‌ పార్క్‌ యజమానులతో కూడా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సమావేశమయ్యారు. తమకు ప్రభుత్వం నుంచి మరిన్ని వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ముందస్తుగా ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని యజమానులు కోరారు. వివిధ శాఖలకు అవసరమైన ఆర్డర్లు అందజేసేందుకు కృషి చేస్తామని శైలజ రామయ్యర్‌ హామీ ఇచ్చారు. నాణ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్యనారాయణ గౌడ్‌, సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వరూపరెడ్డి, చేనేత, జౌళి శాఖ జేడీ ఎన్‌.వెంకటేశ్వర్‌ రావు, ఏడీ రాఘవరావు, మ్యాక్స్‌ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, యజమానులు, ఆసాములు, టెక్స్‌టైల్స్‌ పార్క్‌ యజమానుల సంఘం అధ్యక్షులు అన్నల్‌దాస్‌ అనిల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -