– టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో అధ్యక్షులు అనిల్కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యావిధానాన్ని సాధించడమే తమ ఎజెండా అని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్లో టీపీటీఎఫ్ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంఘం జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేసినప్పుడే విద్యారంగంలో అంతరాలు తొలగిపోతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. విద్యకు సరిపడా బడ్జెట్ను కేటాయించడం లేదని అన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులు భవిష్యత్తును నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ బడులను ఉపాధ్యాయులు కాపాడుకుంటూనే విద్యా ప్రమాణాల పెంపు కోసం కృషి చేయాలని కోరారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మినారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేయడానికే నూతన విద్యావిధానం (ఎన్ఈపీ-2020)ని తెచ్చిందని విమర్శించారు. విద్యా ప్రయివేటీకరణను బలోపేతం చేసేదిగా ఉందన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ సీనియర్ నాయకులు హనుమాండ్లు, మాజీ అధ్యక్షులు సిహెచ్ రాములు, వై అశోక్కుమార్, ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు ఎం ప్రకాశ్రావు, మాజీ సంపాదకులు విఆర్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
కామన్ స్కూల్ సాధనే మా ఎజెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES