నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఖతార్, టర్కీ దేశాల మధ్యవర్తిత్వంలో ఇస్తాంబుల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఎటువంటి ఫలితం తేలకుండానే ముగిశాయి. చర్చలు విఫలమవడానికి పాకిస్థాన్ బాధ్యతారహిత వైఖరే కారణమని ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ పాలకులు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
శనివారం ఉదయం తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. “ఈ చర్చల్లో పాకిస్థాన్ తన భద్రతా వైఫల్యాలన్నింటినీ ఆఫ్ఘనిస్థాన్పై నెట్టే ప్రయత్నం చేసింది. పాక్ అనుసరించిన బాధ్యతారహితమైన, సహకరించని వైఖరి వల్లే చర్చలు విఫలమయ్యాయి” అని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్ కూడా చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని శుక్రవారమే అంగీకరించింది. అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీ మేరకు తాలిబన్లు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో విఫలమయ్యారని పాక్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా, తమ దేశంలో అనేక దాడులకు పాల్పడుతున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.



