నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కంటే దాని తర్వాత జరిగిన అవార్డుల ప్రదానోత్సవమే మరింత వేడిని రాజేసింది. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తనకు అందించిన రన్నరప్ చెక్కును స్టేజీపైనే విసిరికొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. టీమిండియా చర్యకు ప్రతీకారంగానే పాక్ జట్టు ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చ మొదలైంది.
అసలు వివాదానికి మూలం, ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీని అందుకునే విషయంలో మొదలైంది. ఏసీసీ ఛైర్మన్ హోదాలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, ఆ దేశ మంత్రి అయిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు టీమిండియా సున్నితంగా తిరస్కరించింది. ఈ విషయాన్ని ముందుగానే నిర్వాహకులకు స్పష్టం చేసింది. అయినప్పటికీ నక్వీ వేదికపైకి రావడంతో కాస్త గందరగోళం నెలకొంది.
తమ ఛైర్మన్కు అవమానం జరిగిందని భావించిన పాకిస్థాన్ జట్టు, అవార్డుల కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైంది. పీసీబీ నుంచి వచ్చిన సూచనల మేరకే పాక్ కెప్టెన్ ప్రవర్తించినట్లు సమాచారం. ఏసీసీ ప్రతినిధి ఆమినుల్ ఇస్లాం చేతుల మీదుగా రన్నరప్ చెక్కును అందుకున్న సల్మాన్ అలీ ఆఘా, వెంటనే దానిని కిందకు విసిరేసి తన నిరసనను తెలియజేశాడు. భారత్ చర్యను తాము బహిష్కరిస్తున్నట్లు ఈ విధంగా సంకేతమిచ్చాడు.
అనంతరం ఓటమిపై సల్మాన్ అలీ ఆఘా స్పందిస్తూ, “ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. బౌలింగ్లో మేం వంద శాతం రాణించినా, బ్యాటింగ్లో విఫలమయ్యాం. ముఖ్యంగా స్ట్రయిక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడి కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. బ్యాటింగ్ మెరుగ్గా ఉండుంటే ఫలితం మరోలా ఉండేది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.