నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గాం దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందుకే ఇరుదేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరుతూ పాకిస్తాన్ భారత్కు నాలుగు లేఖలు రాసింది.
పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా.. భారత జలశక్తి మంత్రిత్వశాఖకు పంపారు. ఆ తర్వాత ఆ లేఖలను విదేశాంగ మంత్రిత్వశాఖకు పంపినట్లుు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఒప్పందంపై భారత్ చాలా స్పష్టమైన వైఖరితో వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవని, అలాగే రక్తం.. నీరు కూడా కలిసి ప్రవహించలేవని భారత్ స్పష్టం చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నమ్మకంతో, స్నేహభావంతో రూపొందించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఆ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని.. అందుకే తాము ఈ వైఖరి తీసుకున్నట్లు భారత్ తెలియజేసిందని అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి తన మద్దతును నిలిపివేసే వరకూ.. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించడం సాధ్యపడదని భారత్ స్పష్టం చేసింది. పెహల్గామ్ దాడి తర్వాత భారత భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఈ నిర్ణయం తీసుకుంది.