నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం అమెరికా-ఇరాన్ల మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అవాస్తమని భారత్లోని ఇరాన్ రాయబరి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి అన్నారు. ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీకి సంతాపం తెలిపేందుకు ఆయన ప్రస్తుతం పాట్నాకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజమైన దౌత్యానికి బదులుగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగాయని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్-అమెరికాల మధ్య చర్చలు అనేది అవాస్తవం, వారు కేవలం ఆయిల్ ధరలు తగ్గించాలనేది వారి ప్రధాన ఎజెండా. వారు ఏ రకమైన చర్చలు, సమావేశాలకు శ్రద్దగా లేరని, కానీ, తాము చర్చలకు, సమావేశాలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భారత్ తోపాటు అన్ని దేశాలు పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాయని, అందుకు ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు.కానీ పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు అనేది యూఎస్-ఇజ్రాయిల్ల మీద ఆధారపడి ఉందన్నారు. ఆ రెండు దేశాలు పౌర నివాసాలు, స్కూల్స్, ఆస్పత్రులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులతో సామాన్య ప్రజల ఇండ్లు పెద్ద మొత్తంలో ధ్వంసం చేశారని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడులు చేశారని, యుద్ధంలో ఆ కారణంగా వేలమందిని బలితీసుకుంటున్నారని మండిపడ్డారు.
కాగా, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు కలిసి ఇరాన్పై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ప్రతిదాడులకు దిగిన ఇరాన్..యూఎస్-ఇజ్రాయిల్లపై డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించింది. ఉద్రిక్తల కారణంగా చమురు ఎగుమతులకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. రోజురోజుకు పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. మరోవైపు హర్మూజ్ గుండా చమురు నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ఆయా దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొంది.



