Tuesday, June 24, 2025
E-PAPER
Homeఆటలుపంత్‌, రాహుల్‌ ధనాధన్‌

పంత్‌, రాహుల్‌ ధనాధన్‌

- Advertisement -

– లీడ్స్‌లో మనోళ్ల శతక సంబరం
– 300 దాటిన భారత్‌ ఆధిక్యం
రిషబ్‌ పంత్‌ (118), కెఎల్‌ రాహుల్‌ (120) సెంచరీలతో లీడ్స్‌ను హోరెత్తించారు. నాల్గో వికెట్‌కు 195 పరుగులు జోడించిన రాహుల్‌, పంత్‌ భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. పంత్‌, రాహుల్‌ శతకాలతో ఈ టెస్టులో భారత బ్యాటర్ల సెంచరీల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఓ టెస్టులో భారత్‌ ఐదు సెంచరీలు నమోదు చేయటం ఇదే ప్రథమం.

నవతెలంగాణ-లీడ్స్‌
రిషబ్‌ పంత్‌ (118, 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెఎల్‌ రాహుల్‌ (120 నాటౌట్‌, 227 బంతుల్లో 15 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. ఇంగ్లాండ్‌పై లీడ్స్‌ టెస్టులో భారత్‌ నుంచి ఐదో శతకం నమోదు కాగా.. ఆతిథ్య జట్టుకు రికార్డు లక్ష్యం నిర్దేశించేందుకు గిల్‌ సేన సిద్ధమవుతోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (8) నిరాశపరిచినా.. పంత్‌, రాహుల్‌ జోడీ నాల్గో వికెట్‌కు 283 బంతుల్లో 195 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యంతో లీడ్స్‌ టెస్టుపై టీమ్‌ ఇండియా పట్టు బిగించింది. కొత్త బంతితో ఇంగ్లాండ్‌ బౌలర్లు కవ్వించినా పంత్‌, రాహుల్‌ తొలి సెషన్లో సహనంతో ఆడారు. దీంతో ఉదయం సెషన్లో 60 పరుగులే వచ్చాయి. బంతిపై మెరుపు తగ్గాక పంత్‌, రాహుల్‌ బ్యాట్‌ ఝులిపించారు. లంచ్‌ తర్వాత ధనాధన్‌ మెరుపులతో 145 పరుగులు పిండుకున్నారు. నాల్గో రోజు టీ విరామ సమయానికి భారత్‌ 298/4తో నిలువగా.. ఓవరాల్‌గా టీమ్‌ ఇండియా 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ (4 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు.
పంత్‌ ఫటాఫట్‌
లీడ్స్‌లో రిషబ్‌ పంత్‌ ఇన్నింగ్స్‌ సహజశైలికి విరుద్ధంగా మొదలవుతున్నా.. ముగింపులో మాత్రం అతడి శైలి చెరిగిపోలేదు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ ఉత్సాహంతో రెండోసారి బ్యాట్‌ పట్టిన రిషబ్‌ పంత్‌ కెరీర్‌ ఎనిమిదో సెంచరీతో చెలరేగాడు. కొత్త బంతిని గౌరవిస్తూ, సహనంతో సాగిన పంత్‌ ఇన్నింగ్స్‌.. ధనాధన్‌ దంచికొట్టుడుతో అలరించింది. 8 ఫోర్లతో 83 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన పంత్‌.. ఆ తర్వాత టాప్‌ గేర్‌లోకి వచ్చాడు. 25 బంతుల్లోనే 44 పరుగులు పిండుకున్నాడు. పంత్‌ ఊచకోతకు ఇంగ్లాండ్‌ బౌలర్లు దాసోహం అయ్యారు. 95 నుంచి 100 పరుగుల మార్క్‌ చేరుకునేందుకు పంత్‌ ఆశ్చర్యకరంగా 22 బంతులు ఆడాడు. పంత్‌ను బుట్టలో పడేసేందుకు రూట్‌, బషీర్‌ స్పిన్‌ అస్త్రం ప్రయోగించారు. 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 130 బంతుల్లో పంత్‌ టెస్టులో రెండో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రూట్‌ ఓవర్లో 4, 6, 4తో విశ్వరూపం దాల్చాడు. బషీర్‌పై మరో భారీ షాట్‌కు వెళ్లిన పంత్‌.. లాంగ్‌ఆన్‌లో దొరికిపోయాడు. పంత్‌ శతకం సంబరాన్ని సునీల్‌ గవాస్కర్‌, రవిశాస్త్రి గ్యాలరీ నుంచి సెలబ్రేట్‌ చేసుకోవటం అభిమానులను ఆకట్టుకుంది.
రాహుల్‌ సూపర్‌
ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ షాట్‌తో వికెట్‌ చేజార్చుకున్న రాహుల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్లను ఆడుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ (8) ఆరంభంలోనే నిష్క్రమించినా.. రిషబ్‌ పంత్‌తో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. 87 బంతుల్లో ఏడు ఫోర్లతో అర్థ సెంచరీ సాధించిన రాహుల్‌.. 202 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఓ ఎండ్‌లో పంత్‌ దంచికొడుతుండగా.. రాహుల్‌ ఇంగ్లాండ్‌ సహనాన్ని పరీక్షించాడు. ఫైర్‌ అండ్‌ ఐస్‌లా సాగిన ఈ జోడీ జోరు భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించింది.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 471/10
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 465/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) కార్స్‌ 4, రాహుల్‌ నాటౌట్‌ 120, సుదర్శన్‌ (సి) క్రాలీ (బి) స్టోక్స్‌ 30, శుభ్‌మన్‌ గిల్‌ (బి) కార్స్‌ 8, రిషబ్‌ పంత్‌ (సి) క్రాలీ (బి) బషీర్‌ 118, కరుణ్‌ నాయర్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (75 ఓవర్లలో 4 వికెట్లకు) 298.
వికెట్ల పతనం : 1-16, 2-82, 3-92, 4-287.
బౌలింగ్‌ : క్రిస్‌ వోక్స్‌ 12-3-32-0, బ్రైడన్‌ కార్స్‌ 15-2-62-2, జోశ్‌ టంగ్‌ 14-1-55-0, షోయబ్‌ బషీర్‌ 18-1-80-1, బెన్‌ స్టోక్స్‌ 13-2-40-1, జో రూట్‌ 3-0-21-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -