- ఎంఆర్పిఎస్, నవతెలంగాణ,సీవీఆర్ స్టింగ్ ఆపరేషన్తో బట్టబయలు
నవతెలంగాణ-పరకాల: రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన పుడ్ అందించి విద్య వ్యవస్థను బలోపేతం చేయలనే సంకల్పంతో ముందుకెళ్తుంది. ఈక్రమంలో పలు జిల్లాల్లో హాస్టల్ వార్డెన్ల తీరుతో సర్కార్ లక్ష్యం నీరుగారిపోతుంది. పేద పిల్లలకు అందించే నాణ్యమైన బియ్యాన్ని బ్లాక్లో అమ్ముకొని..అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే వరంగల్ జిల్లా పరకాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పలు రోజుల నుంచి యథేచ్చగా జరుగుతున్న తంతును ‘నవతెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. పత్రిక ప్రతినిధి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ,సివిఆర్ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో సుమారు 12 క్వింటాల బియ్యం పట్టుబడ్డాయి.
పరకాల బీసీ వెల్పెర్ హాస్టల్కు చెందిన హాస్టల్ వార్డెన్ అందె రవి.. సన్న బియ్యాన్ని ఓ వ్యక్తికి అమ్మేశాడు. ఆతర్వాత సదురు బియ్యాన్ని ప్రయివేటు వాహనంలో తరలిస్తుండగా.. నవతెలంగాణ పత్రిక ప్రతినిధి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ, సీవిఆర్ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. వెంటనే అధికారులకు సమాచారం అందించగా..సదురు వాహనాన్ని అదుపులోకి తీసుకొని 12క్వింటాల సన్న బియ్యాన్ని సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించి కేసు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్ రవి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే అతడిని సస్పెండ్ చేసి శాఖ పరమైన చర్యలు చేపట్టాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ హెచ్చరించింది.