- ఇవాళ పార్లమెంటు నిరవధికంగా వాయిదా..?
నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు విపక్షాల ఆందోళనలతో దద్దరిలుతున్నాయి. బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చ జరగాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా ఈసీ ఓట్ల చోరీ అంటూ ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాయాలనికి చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా బయలు దేరిన ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఎంపీలకు, పోలీసలుకు మధ్య గర్షణ వాతావరణం నెలకొంది. ఈ తొపులాటలో పలువురు ఎంపీలు కిందపడిపోయారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ పరిణామాలతో అప్రమత్తమైన బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పార్లమెంటు ఉభయ సభలను ఇవాళ(మంగళవారం) నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 వరకు కొనసాగించాలని కేంద్రం ముందుగా నిర్ణయించినా.. వారం రోజుల ముందే వాయిదా వేయనున్నట్లు సమాచారం.
మరోవైపు సోమవారం ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించిననా.. కీలకమైన బిల్లులను ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతుతో ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత కీలకమైన జాతీయ క్రీడా పాలనా బిల్లు, జాతీయ యాంటీ డోపింగ్ (సవరణ) బిల్లు, ఆదాయ పన్ను బిల్లు వంటి వాటిని లోక్సభ ఆమోదించింది.
అదేవిధంగా రాజ్యసభలో మర్చంట్ షిప్పింగ్ బిల్లు, గోవాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్టీ ప్రాతినిధ్యాన్ని సవరించే బిల్లును ఆమోదించారు. కాగా, సమైక్య పింఛన్ పథకం చందాదారులకు పన్ను మినహాయింపులు కల్పిస్తూ పన్ను చట్టాలను, ముఖ్యంగా ఆదాయ పన్ను బిల్లును సవరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై కొంతసేపు చర్చ జరిగిన అనంతరం సభను వాయిదా వేశారు.
ఇక జాతీయ క్రీడాపాలనా బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లును మధ్యాహ్నం 2గంటల తర్వాత వరుసగా ఈ బిల్లులను ప్రవేశపెడుతూ.. ఒకదాని తర్వాత మరొకటి ఆమోదిస్తూ వచ్చారు. సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆదాయపన్ను బిల్లు, పన్ను చట్టాల సవరణ బిల్లును ఆమోదించగానే సభను మంగళవారానికి వాయిదా వేశారు.