నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 21 నుంచి వర్షకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభకానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత జరగనున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దౌత్యపరంగా యూఎస్తో వ్యవహరించిన తీరు, పాక్-ఇండియా దేశాల మధ్య కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యం తదితర అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ప్రశ్నాస్త్రాలతో సిద్దంగా ఉన్నాయి. ఈక్రమంలో పీఎం మోడీ విదేశీ పర్యటనలకు షెడ్యూల్డ్ ఖరారు కావడం గమనార్హం. జులై 23 నుంచి 26 వరకు ప్రధాని మోడీ విదేవీ పర్యటనలకు వెళ్లనున్నారు.
యునైటెడ్ కింగ్డమ్ (UK), మాల్దీవులులలో పర్యటించనున్నారు. ముందుగా జులై 23, 24 తేదీల్లో యూకేలో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానంగా భారత్–యూకే మధ్య జరగనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్న అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారత ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మరింత ప్రవేశం లభించనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, ఐటీ, ఔషధ ఉత్పత్తుల పరంగా రెండు దేశాలకు పెద్ద ప్రయోజనం కలుగనుంది. అలాగే భద్రత, రక్షణ రంగాలలోనూ ఇరుదేశాల మధ్య సహకారాన్ని బలపర్చేలా చర్చలు జరగనున్నాయి.
అనంతరం ప్రధాని మోడీ జులై 25, 26 తేదీల్లో మాల్దీవులను సందర్శించనున్నారు. జులై 26న మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఇది 2019 తర్వాత మోడీ మాల్దీవులకు వెళ్లే మొదటి పర్యటన కావడం విశేషం. ఇటీవల భారత్–మాల్దీవుల మధ్య ఉత్కంఠత పెరిగిన నేపథ్యంలో ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు కీలకంగా మారనుంది. మాల్దీవులలో అభివృద్ధి ప్రాజెక్టులు, మత్స్యవైద్య, టూరిజం, రక్షణ పరంగా భారత్ మద్దతు అందించే దిశగా చర్చలు జరుగుతాయని అంచనా.