నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మూడు నెలల విరామం తర్వాత ఉభయ సభలు ప్రారంభం అవుతున్నాయి. పార్లమెంట్, రాజ్యసభ ఉదయం 11 గంటలతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక వర్షాకాల సమావేశాల్లో విధానపరమైన అంశాలు, పెండింగ్లో ఉన్న చట్టాలు, రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఇదిలావుండగా ప్రతిపక్ష పార్టీలు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని పలుమార్లు కేంద్రానికి విన్నవించాయి. అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేతతో పాటు పలువురు ప్రధానికి లేఖలు కూడా రాశారు. అయినా కానీ బీజేపీ ప్రభుత్వం వారి డిమాండ్ ను పెడచెవిన పెడుతోంది. దీంతో తాజా వర్షాల కాల పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రెసిడెంట్ జోక్యంపై తదితర అంశాలను ప్రతిపక్షాలు లెవనెత్తనున్నాయి. మరోవైపు కేంద్రం అన్ని విషయాలపై స్పందించడానికి సిద్ధంగా ఉందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దీంతో వానాకాల పార్లమెంట్ సమావేశాలు రసవత్తరంగా జరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి.