– యోగాబాబా రాందేవ్ కంపెనీకి కేంద్రం నోటీసులు
– ఆ సంస్థ షేర్ ఐదు శాతం పతనం
న్యూఢిల్లీ: దేశీయ నినాదంతో బడా వ్యాపారాలు చేస్తున్న యోగా గురు, కార్పొరేట్ పారిశ్రామికవేత్త రాందేవ్ బాబాకు చెందిన పతంజలి గ్రూపు అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడింది. దీంతో నిధుల మళ్లింపు, కంపెనీలో కార్పొరేట్ పాలన నిబంధనల ఉల్లంఘనలపై కార్పొరేట్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖకు చెందిన ఫెడరల్ ఎకనామిక్ ఇంటెలిజెన్సీ విభాగం నోటీసులు జారీ చేసింది. ఈ గుర్తించిన వరుస ఆర్థిక లావాదేవీలపై వివరణ కోరినట్టు బ్లూమ్బెర్గ్ న్యూస్ ఎజెన్సీ ఓ రిపోర్ట్లో తెలిపింది. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున నిర్దిష్ట ఆర్థిక వివరాలను వెల్లడించలేదు. అయితే దర్యాప్తు సంస్థలు ఈ లావాదేవీలను అసాధారణమైనవి, సందేహాస్పదమైనవిగా పరిగణించాయని తెలుస్తోంది. రెండు నెలల్లోగా తమ నోటీసులకు స్పందించాలని నిఘా సంస్థ ఆదేశించింది.
కొన్ని నెలల కిందట తప్పుడు ప్రమోషన్ల విషయంలో చిక్కుకున్న రాందేవ్ బాబా కంపెనీ పతంజలి తన ప్రకటన పద్ధతులపై కూడా చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు చికిత్సలను అందిస్తుందని చెప్పుకుని తప్పుదారి పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిధుల మళ్లింపులకు పాల్పడటం ఆ సంస్థ పారదర్శకతను మరింత ప్రమాదంలో పడేసింది. గతేడాది కంపెనీ యూనిట్లలో ఒకదానిపై పన్ను ఉల్లంఘనలతో పాటు తప్పుడు రీఫండ్ క్లెయిమ్కి సంబంధించి కంపెనీ నోటీసులు అందుకున్న సంగతీ తెలిసిందే. వరుస వివాదాల్లోకి పతంజలి సంస్థ కూరుకుపోవటంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. పతంజలి ఆయుర్వేదం చుట్టూ ఉన్న వివాదాలు దాని లిస్టెడ్ అనుబంధ సంస్థ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్పై ప్రతికూలతలను పెంచింది. దీంతో ఈ కంపెనీ షేర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో శుక్రవారం బీఎస్ఈలో 4.33 శాతం పతనమై రూ.1,681కి పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 5 శాతం పైగా కోల్పోయి 1,647 కనిష్టాన్ని తాకింది.
అక్రమంగా పతంజలి నిధులు మళ్లింపు
- Advertisement -
- Advertisement -