నవతెలంగాణ – హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సీనియర్ నటి వాసుకి (పాకీజా)కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఆమె దీనస్థితి గురించి తెలుసుకుని చలించిపోయిన ఆయన, తక్షణ సాయంగా రూ. 2 లక్షలు అందజేశారు.
ఈరోజు అమరావతిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పవన్ కల్యాణ్ తరఫున ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి నటి వాసుకికి రూ. 2 లక్షల చెక్కును అందించారు. ఇటీవల వాసుకి తన ఆర్థిక, అనారోగ్య సమస్యలను వివరిస్తూ, సాయం చేయాలని కోరుతూ విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు.
ఈ సందర్భంగా నటి వాసుకి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన పవన్ కల్యాణ్కు ఆమె కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. “చిన్నవాడైనా పవన్ కల్యాణ్ ఎదురుగా ఉంటే ఆయన కాళ్లు మొక్కుతాను. నా కష్టాన్ని అర్థం చేసుకుని ఆదుకున్నారు. ఆయన కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాను” అని ఆమె పేర్కొన్నారు.