– కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకుంటాం..
– బోడుప్పల్లో దేవాదాయ భూములు పరిశీలించిన మంత్రి కొండా
– కొన్నేండ్లుగా వజ్రేష్ యాదవ్ పోరాటానికి త్వరలోనే ఫలితం..?
నవతెలంగాణ-బోడుప్పల్
ఏండ్ల తరబడి ఆ భూముల రక్షణ కోసం కొట్లాడుతున్న తోటకూర వజ్రేష్ యాదవ్ పట్టుదలకు మంత్రి కొండా సురేఖ స్పందించారు. కబ్జాకు గురవుతున్న భూములపై దృష్టిసారించారు. దేవుడి భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన ఇంచు భూమిని కూడా కబ్జా కాకుండా చూస్తామని హామీనిచ్చారు. మేడ్చల్ మల్కాజగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయశాఖ భూమి అన్యాక్రాంతమవుతున్న అంశంపై వజ్రేష్ యాదవ్ ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఆయన పట్టువదలకుండా వాటి గురించి గొంతెత్తారు. అయినప్పటికీ నాటి సర్కారు స్పందించకుండా కబ్జాదారులనే ప్రోత్సహించిందని ఆరోపణలు ఉన్నాయి. అనేకసార్లు వజ్రేష్యాదవ్ ప్రజాప్రతినిధులకు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం వరంగల్ పర్యటనకు బయలుదేరిన మంత్రి కొండా సురేఖకు మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్, అజరు యాదవ్ ఫోన్చేసి అన్యాక్రాంతమవుతున్న దేవాదాయ భూములను పరిశీలించాలని కోరారు. దీంతో మంత్రి స్థానిక ఆర్డీఓ, ఎంఆర్ఓ ఎండోమెంట్ ఉన్నతాధికారులతో చెంగిచెర్ల ఐఓసీ వద్ద గల దేవుడి మాన్యాలు.. వాటి సరిహద్దులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవుడు భూములను కబ్జా చేసే వాళ్లపై పీడీ యాక్టు పెట్టి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
1976లో అప్పగించారు : మంత్రి
బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 33/8లో 10.35 ఎకరాలు, 33/9లో 13 ఎకరాలు, 33/10లో 6.23 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968లో పట్టాదారులైన తోటకూర ఎల్లయ్యయాదవ్ టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులైన రామయ్య చౌదరి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని మంత్రి తెలిపారు. అనంతరం సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976లో దేవాదాయ శాఖకు అప్పగించారన్నారు. దేవాదాయ శాఖ భూము లను ఎవరు కబ్జా చేసినా స్వాధీనం చేసుకుని వారిపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. మంత్రి వెంట బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజరు యాదవ్, కీసర అర్డీవో ఉపేందర్ రెడ్డి, మేడిపల్లి తహసీల్దారు హసీనా, దేవాదాయ శాఖ సర్వేయర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
పట్టువదలని వజ్రేష్ యాదవ్
సదరు సర్వే నెంబర్ల పరిధిలోని భూముల్లో పక్క సర్వే నెంబర్ల సహాయంతో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 17 ఎకరాలు, హర్ష అనే వ్యక్తి 16 ఎకరాల భూమిలో అధికారులను పక్కదోవ పట్టించి బీఆర్ఎస్ హయాంలో విల్లాలు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల అన్యాక్రాంతంపై 2017లో తోటకూర వజ్రేష్ యాదవ్, 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అప్పటి మల్కాజిగిరి ఎంపీ హౌదాలో జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాంతో సదరు భూములను ప్రోహిబిటెడ్ లిస్టులో చేర్చారు. అయితే, కబ్జాదారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతో అధికారులు చర్యలకు వెనుకంజ వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ మేడ్చల్ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం సర్వే నిర్వహించింది. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో బోడుప్పల్ వంటి ప్రైం ఏరియాలో సుమారు రూ.600 కోట్ల విలువైన దేవాదాయ భూములు కబ్జాలు గురికావడం, వజ్రేష్ యాదవ్ దీనిపై వరుస ఫిర్యాదులు చేయడంతో సర్కారు అప్రమత్తమైంది. మంత్రి కొండా సురేఖ కూడా స్పందించి.. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల హైడ్రా కూడా సందర్శించడం, రెవెన్యూ, దేవాదాయ అధికారులు సర్వే నిర్వహించడంతో నివేదిక సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఏదేమైనా వజ్రేష్ పోరాటం త్వరలోనే ఫలించే అవకాశాలున్నట్టు స్థానికులు భావిస్తున్నారు.
దేవాదాయ భూముల జోలికొస్తే పీడి యాక్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES