డీటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయనీ, వాటిని వెంటనే మంజూరు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు పెన్షన్ సౌకర్యాలు అందడం లేదని తెలిపారు. నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చినా నెరవేరడం ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలు గడువు ముగిసి దాదాపు రెండేండ్లు అయినప్పటికీ అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 12 జిల్లాల్లోనే డీఈవో పోస్టులున్నాయనీ, అందులో నాలుగు జిల్లాలకే రెగ్యులర్ డీఈవోలున్నారని వివరించారు. మిగతా 27 జిల్లాల్లో ఇన్చార్జీ డీఈవోలు పనిచేస్తున్నారని తెలిపారు. 21 జిల్లాలకు డీఈవో పోస్టులే లేవని పేర్కొన్నారు. డీఈవో పోస్టులను మంజూరు చేసి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి అశాస్త్రీయతను పరిశీలించాలని కోరారు. ప్రాథమిక స్థాయిలో 60 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉండాలనడం సరైంది కాదని తెలిపారు. ఆ ఉత్తర్వులను సవరించాలని పేర్కొన్నారు. సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని కోరారు. అపరిష్కృతంగా ఉన్న కేజీబీవీ, మోడల్ స్కూల్, ఐటీడీఏ, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES