Sunday, June 22, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జూలై 1 నుంచి ఆ వాహనాలకు పెట్రోలు, డీజిల్ బంద్

జూలై 1 నుంచి ఆ వాహనాలకు పెట్రోలు, డీజిల్ బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన (ఎండ్-ఆఫ్-లైఫ్) వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధిస్తూ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలకు ఢిల్లీలోని ఏ ఇంధన కేంద్రంలోనూ ఫ్యూయల్ నింపరు.

కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ కఠిన నిబంధనను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ఇంధన కేంద్రాల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 ఇంధన కేంద్రాలలో 500 ఏఎన్‌పీఆర్ కెమెరాలను అమర్చారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 3.63 కోట్ల వాహనాలను స్క్రీన్ చేయగా, సుమారు 5 లక్షల కాలం చెల్లిన వాహనాలను గుర్తించారు. అంతేకాకుండా, 29.52 లక్షల వాహనాలు తమ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లను (పీయూసీసీ) పునరుద్ధరించుకున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినవారికి మొత్తం రూ. 168 కోట్ల విలువైన చలాన్లు జారీ చేశారు.

ఈ నిబంధనల అమలును మరింత పటిష్టం చేసేందుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాలు వాహనాల డేటాను పర్యవేక్షిస్తూ, నిబంధనలు పాటించని వాహనాలు ఎక్కువగా వస్తున్న ఇంధన కేంద్రాలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటాయి.

ఈ మార్గదర్శకాలను ఢిల్లీతో పాటు ఇతర ఎన్‌సీఆర్ నగరాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లలో నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. మిగిలిన ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఏప్రిల్ 2026 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ చర్యల ద్వారా ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -