నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, ఇరు దేశాలు పరస్పర దాడులకు పాల్పడటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి, తక్షణమే తమ పైలట్లను వెనక్కి పిలవాలని, బాంబు దాడులు నిలిపివేయాలని ఆయన గట్టిగా హెచ్చరించారు.
ది హేగ్లో జరిగే నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు మళ్లీ దాడులు చేసుకున్నాయనే విషయాన్ని ఆయన ధృవీకరించారు. “ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ చర్య పట్ల నేను సంతోషంగా లేను. టెల్ అవీవ్ శాంతించాలి. అదే నేను కోరుకుంటున్నా” అని ట్రంప్ స్పష్టం చేశారు.
“ఇజ్రాయెల్.. ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే అవుతుంది. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి” అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇరాన్పై దాడుల విషయంలో గతంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన ట్రంప్, గత రెండు వారాల వ్యవధిలో మిత్రదేశమైన ఇజ్రాయెల్కు ఇలా బహిరంగంగా, సూటిగా హెచ్చరికలు జారీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.