నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో ఆదివారం ఓ ప్రయివేటు శిక్షణా విమానం కుప్పకూలింది. విజయపుర జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం పొలాల్లో క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే, రెడ్ బర్డ్ ఏవియేషన్కు చెందిన తేలికపాటి శిక్షణా విమానం కలబురగి నుంచి బెలగావికి బయలుదేరింది. మార్గమధ్యలో విజయపుర జిల్లా పరిధిలోని మంగళూరు సమీపంలోకి రాగానే ఇంజిన్లో సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని పొలాల్లో అత్యవసరంగా దించే ప్రయత్నం చేయగా, అది అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం ముందు భాగం నుజ్జునుజ్జయింది.
ప్రమాద సమయంలో విమానంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సమాచారం అందుకున్న బాబలేశ్వర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో గాయపడిన ఇద్దరినీ అంబులెన్స్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పైలట్ గౌతమ్ శంకర్గా కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ, ఈ వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రాథమికంగా ఇంజిన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కాగా, విమానం కూలిపోవడానికి ముందే కెప్టెన్, ట్రైనీ పైలట్ దూకేసినట్టు తెలుస్తోంది.



