Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి కాపాడాలి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి కాపాడాలి

- Advertisement -

– మొక్కలు నాటడం, పెంచడం జీవిత చర్యల్లో భాగం చేయాలి
– భవిష్యత్‌లో ఆక్సిజన్‌ మాస్కులు పెట్టుకునే పరిస్థితి రావొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్‌
– గోల్కొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మొక్కలు నాటిన మంత్రి
నవతెలంగాణ-సిటీబ్యూరో

భవిష్యత్‌ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి, వాటిని పెంచి కాపాడాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్యమండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ గోల్కొండ ఏరియా ఆసత్రిలో జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షేట్కార్‌, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మోహిద్దిన్‌, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణమండలి పక్షాన జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని, చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్‌ అందిస్తాయన్నారు. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ మాస్కులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని కోరారు. కాలుష్యం పెరిగిపోయి ప్రజలు క్యాన్సర్‌, షుగర్‌ వ్యాధుల బారినపడి మందులపై ఆధారపడుతున్నారని, కాలుష్యం పెరగకుండా.. హైదరాబాద్‌ మరో ఢిల్లీ కాకుండా.. చెట్లు నాటాలన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. గోల్కొండ ఏరియా ఆస్పత్రికి వచ్చే వారికి మొక్కలు నాటడంపై అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటి ప్లాస్టిక్‌ను దైనందిన జీవితం నుంచి దూరం చేయాలన్నారు. మొక్కలు పెంచడం మన దిన చర్యగా భావించి పుట్టిన రోజులకు, ప్రత్యేక రోజులకు మొక్కలు నాటాలన్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి మాట్లాడుతూ.. చెట్లు ప్రగతికి మెట్లని, ప్రతి ఒక్కరూ మొక్క నాటి సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. శుభ కార్యక్రమాల్లో కేకులను కట్‌ చేసి హంగామా సృష్టించే బదులు మొక్కలు వాడాలన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ జూట్‌ బ్యాగులను ఉపయోగించాలన్నారు. కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మహియుద్దీన్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్నారు. గోల్కొండ ఆస్పత్రిలో ప్రతిరోజూ 1200 నుంచి 1500 మంది అవుట్‌ పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. కొత్త భవనం నిర్మించేందుకు రూ.6 కోట్లు, యంత్రాల కొనుగోలు కోసం రూ.1.80 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఈఈ పి.సురేష్‌, డీసీహెచ్‌ఎస్‌ సూర్యకుమారి, ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకులు శ్రీనివాసరావు, కార్పొరేటర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు, గోల్కొండ ఏరియా ఆస్పత్రి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -