– అతిపెద్ద కాలుష్య కారక దేశంగా భారత్
– ప్రపంచవ్యాప్తంగా ఇండియా వాటా 20 శాతం
– 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉద్గారం
– వినియోగంలో భారత్ మూడో స్థానం : హెచ్చరిస్తున్న పర్యావరణ నిపుణులు, మేధావులు
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. రోజురోజుకూ దీని ఉత్పత్తి, వినియోగం పెరిగిపోతున్నది. ప్రభుత్వాల నుంచి నియంత్రణ కరువైంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా, భారత్లోని పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే.. ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల, ప్లాస్టిక్ వినియోగం.. భారత్లో అధికంగా ఉన్నది. దీంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారక దేశంగా మారింది. ఈ పరిస్థితులపై పర్యావరణవేత్తలు, మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని చెప్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనీ, దీనిపై ప్రభుత్వాలు కఠినమైన విధానాలను రూపొందించాలని సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని టిక్రి కలాన్ వద్ద ఉన్న 250 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్లాస్టిక్ బజార్లో.. ప్లాస్టిక్ స్క్రాప్లతో నింపబడి ఉన్న తెల్లటి పిపి రఫియా సంచుల ఎత్తైన దిబ్బలున్నాయి. భారత్లోని ప్రతి జిల్లా నుంచీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడకు వస్తాయని పీవీసీ, ప్లాస్టిక్ వ్యర్థ డీలర్ల సంఘం కార్యాలయ కార్యదర్శి విజరు వర్మ చెప్పారు. 10-15 టన్నుల సామర్థ్యం కలిగిన 30 నుంచి 50 ట్రక్కుల నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రతి రోజూ వస్తాయని శర్మ తెలిపారు. అయితే, ఈ ప్లాస్టిక్ వ్యర్థాల గణాంకాలు చెప్పినదాని కంటే ఎక్కువే ఉంటాయనీ, రోజుకు 200-250 ట్రక్కులు వస్తాయని సంబంధిత వ్యాపారులు కొందరు చెప్తున్నారు. దీన్ని బట్టి టిక్రీ కలాన్ వద్ద భారీ అనధికారిక మార్కెట్ నడుస్తున్నదని తెలుస్తున్నది.
దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు) నుంచి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) 2022 విశ్లేషణలో.. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్మెంట్ (సీఎస్ఈ) భారత్లో 12 శాతం ప్లాస్టిక్ మాత్రమే రీసైకిల్ చేయబడుతుందని, దానిలో 20 శాతం కాలిపోతుందనీ, 70 శాతం గణనీయమైన స్థాయిలో లెక్కించబడలేదని వివరించింది.
టాప్-10 దేశాలు ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా 50,702 మున్సిపాలిటీల నుంచి సేకరించిన 2020 డేటా ఆధారంగా సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురించిన సెప్టెంబర్ 2024 అధ్యయనం ప్రకారం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఉద్గారిణిగా ఉన్నది. దీని ప్రకారం.. వార్షిక ప్రపంచ ప్లాస్టిక్ వ్యర్థ ఉద్గారాలలో 52.1 మిలియన్ టన్ (ఎంటీ)కి గానూ భారత్ 9.3 ఎంటీ (20 శాతం) వాటాను కలిగి ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (3.5 ఎంటీ), ఇండోనేషియా (3.4 ఎంటీ), చైనా (2.8 ఎంటీ), పాకిస్తాన్ (2.6 ఎంటీ), బంగ్లాదేశ్ (1.7 ఎంటీ), రష్యా (1.7 ఎంటీ), బ్రెజిల్ (1.4 ఎంటీ), థారులాండ్ (1 ఎంటీ), కాంగో (1 ఎంటీ)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సింహభాగం ప్లాస్టిక్ లెక్కల్లోకి రావటం లేదు
భారత్లో 5.8 ఎంటీ ప్లాస్టిక్ బహిరంగంగా కాల్చబడు తున్నది. ఇది విషవాయువుల విడుదలకు కారణమవుతున్నది. 3.5 ఎంటీ ప్లాస్టిక్ పర్యావరణంలోకి విడుదలై, అది చివరగా మహాసముద్రాల్లో కలుస్తున్నది. భారత్లో ఉత్పత్తి అయ్యే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు 27.8 ఎంటీలు అన్ని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. 2022లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్మెంట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారత్లో ప్లాస్టిక్ వ్యర్థాల భూతం భయపెట్టిస్తున్నది. ఇక్కడ 12.3 శాతం ప్లాస్టిక్ రీసైకిల్ అవుతున్నది. 19.8 శాతం కాల్చబడుతున్నది. 67.9 శాతం లెక్కల్లోకి రావటం లేదు.
జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా 1.4 శాతం
2023 ఆర్థిక సంవత్సరంలో భారత్లో రూ.3.5 లక్షల కోట్లుగా అంచనా వేయబడిన ప్లాస్టిక్ పరిశ్రమ.. 2028 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. ఇది 30 వేల ప్రాసెసింగ్ యూనిట్లకు నిలయంగా ఉన్నది. వాటిలో ఎక్కువ భాగం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే కావటం గమనార్హం. ఇవి 40 లక్షల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. జీడీపీలో 1.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 1.07 లక్షల కోట్ల విలువైన ప్లాస్టిక్లను ఎగుమతి చేసిందని ప్లాస్టిక్స్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది.
ప్లాస్టిక్ ప్రమాదకరం
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం, వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతి ప్రకృతికి తీవ్ర ముప్పుగా పరిణమించింది. ఇందులో భారత్ వంటి దేశాల నుంచి విడుదలయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్లాస్టిక్ అనేది ఇతర పదార్థాలు, వస్తువులలా అంత త్వరగా భూమిలోనో, నీటిలోనో కలిసి పోదు. ఇది నశించాలంటే చాలా ఏండ్ల సమయం పడుతుంది. కాలక్రమేణా, ఇది సూక్ష్మ, నానో-పరిమాణ కణాలుగా విడిపోతుంది. ఇవి నేల, గాలి, నీరు, కూర గాయలు వంటి ఆహార పదార్థాల్లోకి చొచ్చుకు పోయి.. మానవులు, జంతువులలో ఆరోగ్య సమస్య లను కలిగిస్తాయి. గుండె, మెదడు, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రవాహం.. ఇలా మానవుడి శరీరం ఉండే కీలక అవయవాలు, జరిగే పనులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇక జంతువులైతే.. తెలియక తరచుగా ప్లాస్టిక్ను తింటుంటాయి. ఇవి కాస్తా.. ఆ పశువుల ప్రాణాలను హరించివేస్తాయి. ఇక పరిశ్రమల నుంచి విడుదలయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులు, కుంటలు, నదులు, సముద్రాలను కలుషితం చేసి, అక్కడి జీవరాశికి ప్రమాదకరంగా మారుతున్నాయి.
చట్టబద్ధమైన ఒప్పందం వాయిదా
ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. 2022లో 175 యూఎన్ సభ్య దేశాలు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టటానికి మొట్టమొదటి చట్టబద్ధమైన ఒప్పందాన్ని రూపొందించటానికి అంగీకరించాయి. అయితే, గతేడాది కొరియాలోని బుసాన్లో జరిగిన చర్చల సందర్భంగా.. ప్లాస్టిక్ ఉత్పత్తిని మూసివేయటం వంటి వివిధ అంశాలపై విభేదాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తి చేసే దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతే దీనికి కారణమైంది. తదుపరి చర్చలు ఆగస్టు 4 నుంచి 14 వరకు జెనీవాలో జరగనున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాల విడుదలలో
తమిళనాడు ఫస్ట్.. తెలంగాణ నెక్స్ట్
భారత్లో ఏటికేడూ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి పెరుగుతున్నది. లోక్సభలో భారత ప్రభుత్వం తెలిపిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) సమాచారం ప్రకారం.. 2019 ఆర్థిక సంవత్స రంలో భారత్లో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 3.36 ఎంటీలుగా ఉన్నది. ఆ తర్వాత 2020లో 3.47 ఎంటీలు, 2021లో 4.13 ఎంటీలు, 2022లో 3.9 ఎంటీలు,2023లో 4.34 ఎంటీలుగా ఉన్నది. భారత్లో ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేసే రాష్ట్రాల్లో ఏడాదికి 0.782 ఎంటీలతో తమిళనాడు టాప్లో ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ (0.528 ఎంటీ), ఢిల్లీ (0.403ఎంటీ), మహారాష్ట్ర (0.395 ఎంటీ), కర్నాటక (0.360 ఎంటీ)లు ఉన్నాయి. తక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేసే రాష్ట్రాలు, యూటీలలో సిక్కిం ఏడాదికి కేవలం 84.64 టన్నుల వాటాతో ముందు వరుసలో ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో నాగాలాండ్ (342.89 టన్నులు), త్రిపుర (347.3 టన్నులు), అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ (744 టన్నులు), లఢక్ (860.5 టన్నులు)లు ఉన్నాయి.
తలసరి ప్లాస్టిక్ వినియోగం 13 కేజీలు
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. తలసరి ప్లాస్టిక్ వినియోగం 13కిలోలుగా ఉన్నది. ఇది ప్రపంచ సగటు 30 కిలోలతో పోలిస్తే తక్కువే అయినా.. ప్రమాదకర మేనని అంటున్నారు. భారత్.. ఒక వ్యక్తికి ఒక రోజుకు 0.054 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్నది. ఇది ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణలో భారత అసమర్థతను బహిర్గతం చేస్తున్నది.