– ఇరాన్లో భారతీయ విద్యార్థుల ఆందోళన
– నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం : భారతీయ విద్యార్థులు
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో …. ఇరాన్లోని భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం చేపట్టింది. ఇరు దేశాల మధ్య వరుసగా మూడో రోజు కూడా క్షిపణుల దాడులు కొనసాగుతుండటంతో ఇరాన్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ” మమ్మల్ని కాపాడండి ప్లీజ్ ” అంటూ భారతీయ విద్యార్థులంతా విన్నవించుకుంటున్నారు. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో నిరంతరం అట్టుడుకుతోంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
ఒక్క విశ్వ విద్యాలయంలోనే 350మంది భారతీయ విద్యార్థులు ….
”శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్మెంట్కు పరుగులు తీశాం. అప్పటినుంచి మాకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి. ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది” అని భారతీయ వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. 22 ఏండ్ల ఇంతిసాల్.. టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ ఒక్క విశ్వవిద్యాలయంలోనే తనతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులున్నారని అతడు తెలిపాడు. ”దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ, మేం చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని ఆ వైద్య విద్యార్థి అభ్యర్థించాడు.
”ఇక్కడ పరిస్థితి ఏమీ బాలేదు. రోజూ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. తాగునీటిని కూడా భద్రపర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. వైద్యులుగా మారేందుకు ఇక్కడికి వచ్చాం. కానీ, ఇప్పుడు ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది. మమ్మల్ని కాపాడండి ప్లీజ్” అని మరో విద్యార్థి ఫైజాన్ నబీ ఆవేదన వెళ్లగక్కాడు. మరికొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఇలాగే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూసరిహద్దులు తెరుచుకున్నాయి : ఇరాన్ విదేశాంగ మంత్రి
ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించాలన్న భారత అభ్యర్థనకు ఇరాన్ సోమవారం స్పందించింది. ఇరాన్ గగనతలం మూసివేయ బడినప్పటికీ, విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా అన్ని భూ సరిహద్దులు తెరుచుకున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రక్త పరిస్థితులు, దేశంలోని విమానాశ్రయాల మూసివేయడంతో, అనేక దేశాలు తమ దౌత్యవేత్తలను, పౌరులను సురక్షితంగా పంపాలన్న అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని అన్ని భూభాగాల సరిహద్దులు తెరిచి ఉన్నాయని తెలియజేస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. దౌత్యవేత్తలు మరియు పౌరులను సురక్షితంగా తరలిం చేందుకు సహాయం అందిస్తామని తెలిపింది. సరిహద్దులను దాటే వ్యక్తుల పేర్లు, పాస్పోర్ట్ నెంబర్లు మరియు వాహనాల వివరాలను జనరల్ ప్రోటోకాల్ విభాగానికి అందించాలని ఇరాన్ భారత్ను కోరింది. దౌత్యవేత్తలు మరియు ఇతర పౌరుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రయాణ సమయం మరియు ఆ వ్యక్తి ఏ సరిహద్దు నుండి వెళతారో తెలియజేయాలని కోరింది. ఇరాన్లోని వివిధ నగరాల్లో 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉండగా, వారిలో ఎక్కువమంది జమ్మూకాశ్మీర్కు చెందినవారే ఉన్నారు.
ఇప్పటికే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం : విదేశాంగ శాఖ
ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ”ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. కమ్యూనిటీ నాయకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం” అని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితి మరింత తీవ్రంగా మారితే.. వారిని తరలించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.
ఇరాన్ దాడులతో ఐరన్ డోమ్కు బీటలు

– ఇజ్రాయిల్ అంచనాలు తలకిందులు
– ఐరన్ డోమ్ సామర్థ్యంపై అనేక అనుమానాలు
టెల్ అవివ్: ఇరాన్ దాడులతో ఐరన్ డోమ్ బీటలు వారింది. ఇజ్రాయిల్ యొక్క ఐరన్ డోమ్ ప్రపంచంలో అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటని.ఇది రాకెట్లు, క్షిపణులు, ఇతర వైమానిక దాడుల ను సమర్థవంతం గా అడ్డుకుంటుంద నే ప్రచారం ఇరాన్ క్షిపణి దాడులతో పటాపంచలు అయిపోయింది.ఇజ్రాయిల్ దాడులకు ఆత్మరక్షణ లో భాగంగా ఇరాన్ 100 కంటే ఎక్కువ క్షిపణులతో చేసిన దాడిని ఐరన్ డోమ్ తట్టుకోలేకపోయింది.ఈ దాడులను పూర్తి స్ధాయిలో అడ్డుకోలేకపోయిందని,ఇందులో సాంకేతిక లోపాలు, ఇంటర్ సెప్టర్ మిస్సైళ్ల స్టాక్ తగ్గిపోవడం వంటి పలు లోపాలున్నాయని మీడియా కధనాలు తెలిపాయి.ఇరాన్ దాడుల సమయంలో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఇజ్రాయిల్ అప్రమత్త సైరన్లు మోగించింది, ప్రజలు బంకర్లలో దాక్కున్న పరిస్థితి.ఈ సంఘటనలు ఐరన్ డోమ్ యొక్క సామర్థ్యంపై అనుమానాలను రేకెత్తించాయి. కొందరు విశ్లేషకులు ఈ వ్యవస్థ అధిక సంఖ్యలో క్షిపణులను ఒకేసారి ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు
ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండిస్టీస్ (ఐఏఐ), రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక బహుళ స్ధాయి రక్షణ వ్యవస్థ. ఇది షార్ట్ రెంజ్ రాకెట్లు,ఆర్టిలరీ ఫెల్స్,డ్రోన్ల దాడులను గుర్తించి, ట్రాక్ చేసి నాశనం చేయగలదని. ఇది 90 శాతం విజయవంతమైనదని ఇజ్రాయిల్ రక్షణ శాఖ ప్రకటించింది.కాని ఇరాన్ దాడులతో ఇజ్రాయిల్ అంచనాలు తలక్రిందులయ్యాయి.అయితే ఐరన్ డోమ్ ,మోస్సాద్ వంటి ఇంటిలిజెన్స్ వ్వవస్తల బలంతో పాటు అమెరికా దన్నుతో ఇజ్రాయిల్ పేట్రేగిపోయిందని,దాడులకు తెగబడుతుందని అనేక వర్గాలు విమర్శిస్తున్నాయి.