నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ వంతెనను పీఎం మోడీ ప్రారంభించారు. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా జమ్మూకశ్మీర్లో నిర్మించారు. ఈ కాట్రా-టు-సంగల్దాన్ స్ట్రెచ్లో భాగంగా ఉంటుంది. ఇది న్యూఢిల్లీని నేరుగా కాశ్మీర్తో కాట్రా ద్వారా కలుపుతుంది. ఈ ప్రాజెక్టును రూ. 43,780 కోట్లతో నిర్మించారు. అదే విధంగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుండి శ్రీనగర్కు తిరిగే రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా పీఎం జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆయన వెంట కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పాటు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తో కూడా ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో ఉన్న చీనాబ్ వంతెన నదీగర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఇంజనీర్ల అద్భుతం. ఇది చరిత్రలో మొదటిసారిగా అధికారికంగా కాశ్మీర్ లోయను రైలు ద్వారా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. అలాగే ఈ ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) పొడవు దాదాపు 272 కిలోమీటర్లు. ఈ 272 కిలోమీటర్లలో, దాదాపు 119 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 36 సొరంగాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రాజెక్టులో దాదాపు 1,000 వంతెనలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇది న్యూ ఇండియా స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని, ఇంజనీర్లు ప్రతిభ అద్భుతమని కేంద్రమంత్రి కొనియాడారు.
