నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ మండిపడ్డారు. శత్రుత్వాన్ని పెంచేవిధంగా ప్రకటనలు చేస్తూ మీ పరువు పోగొట్టుకోకండి. దీనికి బదులుగా దేశ సంక్షేమంపై దృష్టి పెట్టండి అని అని మోడీకి స్టాలిన్ హితవు పలికారు . బహుళ సాంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వం గురించి గర్వించే గొప్ప భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే చిల్లర రాజకీయ పద్ధతులను ఆపాలని ప్రధానిమంత్రిని, బిజెపి సభ్యులను స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. హిందూ ముస్లింల మధ్యనే కాదు.. తమిళులు- బీహారీల మధ్య కూడా శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. ఇలాంటి విద్వేష రాజకీయాల కంటే.. ముందు దేశ సంక్షేమంపై దృష్టి పెట్టండి అని మోడీకి స్టాలిన్ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
కాగా, త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోడీ ఛప్రాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని విద్వేష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కోసం అక్కడికి వలస వెళ్లిన బీహారీలను వేధిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తమినాడు సిఎం స్పందించారు. ఒక తమిళ వ్యక్తిగా నరేంద్ర మోడీని అభ్యర్థించడానికి నాకు బాధగా ఉంది. ఈ దేశంలోని అందరికీ తాను ప్రధానమంత్రి. అలాంటి గౌరవనీయమైన స్థానంలో తానున్న విషయాన్ని మోడీ తరచుగా మరచిపోతున్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ఆయన తన బాధ్యతకు తగిన గౌరవాన్ని కోల్పోకూడదని అభ్యర్థించడం నాకు బాధగా ఉంది అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. బిజెపి నేతలు ఎక్కడికెళ్లినా.. ఒడిశా- బీహార్ అని చెబుతూ..ఎన్నికల రాజకీయాల కోసం తమిళుల పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేయడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని స్టాలిన్ అన్నారు.
డిఎంకె ఎంపి కనిమొళి కూడా ప్రధాని మోడీ, బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో (బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు) ఎన్నికలు జరిగినప్పుడల్లా తమిళనాడును, తమిళులను శత్రువులుగా చిత్రీకరించడం, ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడడం బిజెపికి దినచర్యగా మారింది. గతసారి ఒడిశా ఎన్నికల సమయంలోనూ వారు సరిగ్గా ఇదే పని చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా తమను తాము రక్షించుకోవడానికి వలస కార్మికులను ఎలా గాలికొదిలేశారో అందరికీ తెలిసిందే. అప్పట్లో వలస కార్మికుల్ని తమిళనాడు ఎలా కాపాడిందో.. వారికెలా సహాయపడిందో వారికి తెలుసు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తారు అందులో సందేహం లేదు అని ఆమె అన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవినుద్దేశించి.. ‘బీహార్కు చెందిన ఒకే ఒక వ్యక్తి తమిళనాడులో తన రాజకీయాలు చేయలేకపోతున్నారు. అతను రాజ్భవన్లోనే ఉంటున్నారు’ అని ఆమె విమర్శించారు.

 
                                    