– సీఐ విశ్వేశ్వర్ సమయస్ఫూర్తికి భక్తుల ప్రశంసలు
నవతెలంగాణ – గీసుగొండ : గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో శనివారం జరిగిన రథోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ చిన్నారి తప్పిపోయిన ఘటన చోటుచేసుకుంది.
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల పాప రియాన్స్ శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో జాతరలో తన కుటుంబ సభ్యుల నుండి తప్పిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై చిన్నారిని వెతికారు.
చివరకు చిన్నారిని గుర్తించి గీసుగొండ పోలీస్ కంట్రోల్ రూమ్కు తీసుకువచ్చి, సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో పాప తల్లి నన్నబోయిన శిరీషకు అప్పగించారు.
పోలీసులు చూపిన సమయస్ఫూర్తి, అప్రమత్తతకు అక్కడి భక్తులు అభినందనలు తెలిపారు. కొమ్మాల జాతరలో భక్తుల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు.



