Tuesday, October 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పోలీసుల సేవలు త్యాగపూరితమైనవని

పోలీసుల సేవలు త్యాగపూరితమైనవని

- Advertisement -

ఘనంగా ప్లాగ్ డే వేడుకలు
హాజరైన ఉన్నతాధికారులు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా మంగళవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో, దేశ సరిహద్దుల రక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమరవీరుల ముఖ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ స్తూపం ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్యక్రమం ప్రారంభంలో ఉన్నతాధికారులు స్తూపం వద్ద జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు శస్త్రసల్యూట్‌తో అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. శోక శస్త్ర ద్వారా సలామి ఇచ్చి, రెండు నిమిషాల మౌనం పాటించి అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.

పోలీసుల సేవలు నిస్వార్థమైనవి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం పోలీసులు మాత్రమే చేయగలరని తెలిపారు. వారి సేవలు నిస్వార్థమైనవి, త్యాగపూరితమైనవని అన్నారు. ప్రతి ఒక్కరు పోలీసు వ్యవస్థకు సహకరించి నేర నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలను సమాజంలో గౌరవప్రద స్థానాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడక్ సమీపంలోని హాట్‌ స్ప్రింగ్ ప్రాంతంలో చైనీయుల దాడిలో పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారని, ఆ సంఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో 50 మంది పోలీసు సిబ్బంది త్యాగాలు చేశారని, వారి స్ఫూర్తితో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల భద్రత కోసం ముందుకు సాగుతోందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి అవసరాలైనా పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారి త్యాగం దేశానికి శాశ్వత గౌరవం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి. సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, కమతం ఇంద్రవర్ధన్, డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్‌ఎం, రెండవ బెటాలియన్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -