నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాణ్యతలేని నిర్మాణాలు సామాన్య ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. లోపభూయిష్టమైన నిర్మాణాలు చేపడుతూ..పరివేక్షణ లోపంతో లక్షల కోట్ల ప్రజల ధనం వృథా చేస్తుంది ఆ రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రచార్భాటాలు తప్పా..పాలనలో మార్కు లేదని పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. అందుకు ఇటీవల జరిగిన సంఘణనలే అద్దంపడుతున్నాయి.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నిర్మించిన 90 డిగ్రీల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ , పాములా మెలికలు తిరిగిన వంతెన ఇటీవలే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి విషయం తెలిసిందే.
భోపాల్లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో 90 డిగ్రీల మలుపు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనిపై ప్రయాణించే వాహనాలు ఒకేసారి 90 డిగ్రీల మలుపు తిరిగితే, ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోపాల్లోని ఐష్బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సుదీర్ఘ సమయం వేచి ఉండవలసిన అవసరాన్ని నివారించడం కోసం ఈ వంతెనను నిర్మించారు.

భోపాల్లోని సుభాష్ నగర్లో రెండేళ్ల కిందట ఈ పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బిడ్జిని నిర్మించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ వంతెన నిర్మాణంలో ఇంజినీర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వంతెనపై డివైడర్లు సైతం సరిగా లేవు. అంతేకాదు కేవలం ఎనిమిది గంటల్లోనే రెండు ప్రమాదాలు సంభవించాయి. దీంతో దీని నిర్మాణం, భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఘోర దుర్ఘటన జరిగింది. వడోదర జిల్లాలోని పద్రా పట్టణ సమీపంలోని గంభీర అనే వంతెన బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మహిసాగర్ నదిలో పడి చిన్నారి సహా 11 మంది మృతి చెందారు. గంభీర బ్రిడ్జి 1985లో ప్రారంభమయ్యిందని గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. అయితే, వర్షాకాలం వచ్చినప్పటికీ.. బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అందుకే బ్రిడ్జి కూలిపోయిందని చెప్తున్నారు.
గుజరాత్లో వంతెనలు కూలడం నిత్యకృత్యంగా మారిందని, మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనలో 141 మంది మరణించినప్పటికీ, అధికారుల్లో ఏ మాత్రం చలనం రావట్లేదని మండిపడుతున్నారు. గుజరాత్లో 2021 డిసెంబర్ నుంచి మూడు నెలలకొకటి చొప్పున అన్నట్టు గడిచిన నాలుగేండ్లలో 14 వంతెనలు కూలిపోయాయి.