Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపూర్ణచందర్‌ నాయక్‌ అరెస్ట్‌

పూర్ణచందర్‌ నాయక్‌ అరెస్ట్‌

- Advertisement -

– జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక పురోగతి
– ఐదేండ్లు ప్రేమ పేరుతో మోసం చేశాడని కుటుంబం ఆరోపణ
– బీఎన్‌ఎస్‌, పోక్సో చట్టాల కింద కేసు నమోదు
నవతెలంగాణ -ముషీరాబాద్‌

స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్‌ నాయక్‌ను హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లాస్ట్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, స్వేచ్ఛ చివరిసారి మాట్లాడిన వ్యక్తిగా పూర్ణచందర్‌ను గుర్తించి విచారణ చేపట్టారు. అయితే స్వేచ్ఛ అంత్యక్రియలకు రాని పూర్ణచందర్‌ శనివారం రాత్రి 11 గంటలకు తన లాయర్‌తో కలిసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం పోలీసులు నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి ఏసీపీ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పూర్ణచందర్‌పై బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ 69, 108 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రతిసారి పెండ్లి మాట తప్పించుకోవడం వల్లే స్వేచ్ఛ మనోవేదనకు గురై తీవ్ర నిర్ణయం తీసుకుందని ప్రాథమికంగా వెల్లడైందని తెలిపారు. న్యాయ ప్రక్రియను వేగంగా పూర్తిచేస్తామని తెలిపారు.
పూర్ణచందర్‌ వేధింపులే స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం : స్వేచ్ఛ తండ్రి
పూర్ణచందర్‌ వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని స్వేచ్ఛ తండ్రి శంకర్‌ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. తన కూతుర్ని పెండ్లి చేసుకుంటానని వెంటపడ్డాడని, చివరకు తన కూతురు పెండ్లికి అంగీకరించిన తర్వాత ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయని తెలిపారు. ఇటీవల పూర్ణచందర్‌ నాయక్‌ ఇంట్లో ఓ ఫంక్షన్‌ జరిగిందని అయితే స్వేచ్ఛను పిలవకపోవడంతో ఎందుకు పిలువలేదని ఆమె నిలదీసిందన్నారు. గొడవలు తారాస్థాయికి చేరడంతో ఇటీవల తన కూతురు పూర్ణచందర్‌తో ఉండనని తేల్చి చెప్పిందని, దానిలో భాగంగా జూన్‌ 26న ఇద్దరికీ గొడవ జరిగితే తనను ఇంటికి రమ్మని పిలిచిందని చెప్పారు. పూర్ణచందర్‌ వేధింపుల వల్ల స్వేచ్ఛ తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. గతంలో ఎంతోమంది అమ్మాయిలను పూర్ణచందర్‌ నాయక్‌ వేధించాడని ఆరోపించారు. పూర్ణచందర్‌ నాయక్‌ భవిష్యత్తులో మరే అమ్మాయి జీవితం నాశనం చేయ కుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఎంతో ప్రేమను పంచాం : స్వేచ్ఛ మేనమామ, మేనత్త
స్వేచ్ఛను నాలుగు నెలల పాప నుంచి పదేండ్ల వరకు ఏ లోటు లేకుండా ఎంతో ప్రేమగా పెంచామని ఆమె మేనమామ నరసయ్య, అత్త సుశీల చెప్పారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి పార్టీలో కొనేండ్ల పాటు పనిచేశారని, ఆ సమయంలో తమ దగ్గరే పెరిగిందని తెలిపారు. రోజూ తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని స్వేచ్ఛ కాల్‌ చేసి చెప్పినప్పుడు పూర్ణచందర్‌తో మాట్లాడామన్నారు. పూర్ణచందర్‌ కుటుంబంలో స్వేచ్ఛ అందరికీ తెలుసునని, పూర్ణ చందర్‌ తండ్రి చాలాసార్లు స్వేచ్ఛ ఇంటికి వచ్చాడని తెలిపారు. వారి కుటుంబంలో సభ్యురాలుగా ఎందుకు గుర్తించడం లేదని స్వేచ్ఛ డిప్రెషన్‌లోకి వెళ్లిందన్నారు. భార్య స్థానం ఇచ్చానని పూర్ణచందర్‌ ప్రజలను కేసును తప్పుదారి పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -