16 నుంచి 18 ఏండ్ల మధ్య అంగీకార
లైంగిక సంబంధాలపై అమికస్ క్యూరీ సలహా
న్యూఢిల్లీ : కౌమార దశలో 16 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు ఉన్న యువతీ యువకుల మధ్య ఇష్టపూర్వక లైంగిక చర్యను పోస్కో చట్టం కింద నేరంగా పరిగణించవద్దని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక సలహాదారు (అమికస్ క్యూరీ), సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ అత్యున్నత న్యాయస్థానానికి సలహా ఇచ్చారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో లిఖితపూర్వక నివేదికను సమర్పించారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం – 2012 (పోస్కో) 16 నుంచి 18 ఏండ్ల మధ్య యువతీ యువకుల లైంగిక చర్యను నేరంగా పరిగణిస్తుంది. 2012లో న్యాయవాది నిపుణ్ సక్సేనా దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో మన దేశంలో మొదటి మహిళా అదనపు సొలిసిటర్ జనరల్, సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ను అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు నియమించింది. ఆమెకు న్యాయవాదులు పరాస్నాధ్సింగ్, ఎస్ షేర్వానీ, రోహిన్ భట్, ఆర్ సిన్హా సహకరించారు. పోస్కోలోని సెక్షన్ 2 (డి)లో చైల్డ్ అన్న పదంలో ఏకాభిప్రాయంతో లైంగిక చర్యలో పాల్గొనే 16 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారిని చేర్చకూడదని నివేదిక పేర్కొంది. సమ్మతి వయసు 16 ఏండ్లు అని గత 80 ఏండ్లుగా ఉందని, దానిని పెంచడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణాన్ని సూచించలేదని, ఎటువంటి డేటా కూడా లేదని తెలిపింది. క్రిమినల్ సవరణ చట్టంలో ఉన్న అంశాన్ని బీఎన్ఎస్లో కూడా ఉంచారని వివరించింది. లైంగిక అంశాలపై విద్య నేర్పకుండా, వారికి అవగాహన పెంచకుండా అటువంటి చర్యను నేరంగా పరిగణించడం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, చట్టంలో నిర్వచించబడిన పిల్లల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. పోస్కో చట్టంలోని అసలు ఉద్దేశం పిల్లలను లైంగిక దోపిడీ, బలవంతపు చర్యల నుంచి రక్షించడం అని, ఇష్టపూర్వక సంబంధాల,ను నురంగా పరిగణించడం కాదని పేర్కొంది. 16 ఏండ్ల కంటే తక్కువ వయసు వారి పిల్లలకు ఉన్న రక్షణ కొనసాగించాలని సూచించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పోక్సో నేరంగా పరిగణించొద్దు
- Advertisement -
- Advertisement -