– భారత్-ఏతో శుభ్మన్ గిల్సేన ఢీ
– నేటి నుంచి ఫస్ట్క్లాస్ టూర్ మ్యాచ్
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కు శుభ్మన్ గిల్ నేటి నుంచి సమర సన్నద్ధం కానుంది. 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆరంభం కానుండగా.. నేటి నుంచి భారత్-ఏతో శుభ్మన్ గిల్ సేన తలపడనుంది. ఓపెనర్, నం.4 బ్యాటర్ సహా పేస్ ఆల్రౌండర్ స్థానాలపై సందిగ్థం నెలకొనగా నాలుగు రోజుల టూర్ మ్యాచ్లో గిల్, గంభీర్ ద్వయం ఓ అవగాహనకు రావాలని చూస్తున్నారు.
లండన్ (ఇంగ్లాండ్)
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత టెస్టు క్రికెట్ దిగ్గజాల సేవలను కోల్పోయింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్లు ఐదు రోజుల ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానాన్ని శుభ్మన్ గిల్ అందుకున్నా.. ఓపెనర్గా అతడి స్థానం భర్తీ చేయాల్సి ఉంది. విరాట్ కోహ్లి లేని భారత టెస్టు జట్టును ఊహించలేం. కోహ్లి వీడ్కోలు నిర్ణయంతో బ్యాటింగ్ లైనప్లో నం.4 స్థానం ఖాళీ అయ్యింది. బ్యాటింగ్ లైనప్లో రెండు కీలక స్థానాలకు సరైన బ్యాటర్లను ఎంచుకోవటంతో పాటు కీలక పేస్ ఆల్రౌండర్ను తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బజ్బాల్ క్రికెట్తో ఇంగ్లాండ్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్న టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఏ అవకాశాన్ని వదులుకునేలా లేదు. తొలి టెస్టు ముంగిట ఎదుర్కొంటున్న పలు కీలక సవాళ్లకు నేటి నుంచి భారత్-ఏతో జరుగనున్న టూర్ గేమ్లో సమాధానం దొరబుచ్చుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. గ్రేటర్ లండన్లోని బకెన్హామ్ కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో నేటి నుంచి భారత్-ఏ, భారత్ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆరంభం కానుంది.
ఓపెనర్గా రాహుల్?
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు తోడుగా ఇన్నింగ్స్ను మొదలెట్టే మరో ఓపెనర్ ఎవరనే ప్రశ్నకు టీమ్ మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ లయన్స్తో రెండో అనధికార టెస్టులోనే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. గతంలో రిజర్వ్ ఓపెనర్గా జట్టుతో ప్రయాణం చేసిన కెఎల్ రాహుల్.. రోహిత్ శర్మ స్థానం దక్కించుకునే వీలుంది. రెండో అనధికార టెస్టులో భారత్-ఏ తరఫున ఆడిన కెఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో 116 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులు సాధించాడు. పేసర్లకు అనుకూలించిన పిచ్పై కెఎల్ రాహుల్ ఆకట్టుకునే ఆట తీరు ప్రదర్శించాడని ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ సైతం కితాబిచ్చాడు. ఓ సెంచరీ, అర్థ సెంచరీతో దంచికొట్టిన రాహుల్ ఓపెనర్గా రావటం లాంఛనమేనని తెలుస్తోంది.
ఆ స్థానంలో గిల్ వస్తాడా?
ఇక విరాట్ కోహ్లి నం.4 బ్యాటింగ్ పొజిషన్పై చిక్కుముడి కొనసాగుతుంది. టూర్ గేమ్లో భారత్ తరఫున ఆ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. శుభ్మన్ గిల్ నం.3 స్థానం వదులుకుని నం.4 స్థానంలోకి వస్తాడా? లేదంటే యువ బ్యాటర్ సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్లో ఒకరికి అవకాశం ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. గిల్ బ్యాటింగ్ పొజిషన్లో మార్పులు ఉన్నా లేకపోయినా.. సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ సహా కరుణ్ నాయర్లో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లు ఇటీవల అనధికార టెస్టులతో పాటు దేశవాళీ సర్క్యూట్లో నిలకడగా రాణించారు. టెస్టు జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి ఆరంభం కానున్న టూర్ గేమ్ ఈ ముగ్గురు బ్యాటర్లకు కఠిన పరీక్షగా నిలువనుంది.
నితీశ్, ఠాకూర్లలో ఎవరు?
పేస్ ఆల్రౌండర్గా ఎవరిని ఎంచుకోవాలనే తర్జనభర్జన జట్టు మేనేజ్మెంట్లో కనిపిస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్యాట్తో నిలకడగా మెరిసిన నితీశ్ కుమార్ రెడ్డి.. బంతితో తేలిపోయాడు. ఇటీవల ఐపీఎల్లోనూ నితీశ్ అంచనాలను అందుకోలేదు. మరోవైపు శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్ వేలంలో నిరాశ ఎదుర్కొన్నా.. తర్వాత లక్నో తరఫున అదరగొట్టాడు. బ్యాట్తో, బంతితో మంచి ప్రదర్శన చేయటంలో శార్దుల్ ఠాకూర్ దిట్ట. భారత్-ఏ తరఫున అనధికార టెస్టుల్లోనూ శార్దుల్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బ్యాట్తో పరుగులు రాబట్టడం కంటే బంతితో బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగించే పేస్ ఆల్రౌండర్కు గిల్, గంభీర్ ఓటేయనున్నారు. నేడు వార్మప్ మ్యాచ్లో నితీశ్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్లు తుది జట్టులో చోటు కోసం ఉత్తమ ప్రదర్శన చేయాలని ఎదురుచూస్తున్నారు. నాలుగు రోజుల టూర్ గేమ్లో అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగుతున్నారు. ప్రసిద్ కృష్ణ, జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ ఇంగ్లీశ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు టూర్ గేమ్ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.
సమర సన్నాహకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES