రాష్ట్రంలో తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో, ప్రజా ఉద్యమాలను నిర్మించిన చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ చెప్పారు. బుధవారం హైదరాబాద్లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సర్దుబాటు, కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఈనెల నాలుగో తేదీన జరగనున్న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని ఓడిరచడమే తమ రాజకీయ కర్తవ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడిరదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, యూరియాను ఇవ్వడం లేదని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంత జెడ్పీ చైర్మన్ స్థానాలు ఎస్టీలకే ఉండాలి
స్థానికసంస్థల ఎన్నికల్లో ఐదో షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు రిజర్వేషన్ అమలు చేయొద్దంటూ నిబంధనలున్నాయని, గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మెన్ స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్ ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జిల్లా పరిషత్ రిజర్వేషన్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. ఆదివాసీలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జెడ్పీ చైర్మెన్ స్థానాలను జనరల్ స్థానాలుగా ప్రకటించడం సరైంది కాదని చెప్పారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న జెడ్పీ చైర్మెన్ స్థానాలను ఎస్టీ రిజర్వేషన్ కొనసాగించేలా ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేశారు.