నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం యూకే పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు చేయడంతో పాటు, ఖలిస్తానీ తీవ్రవాదుల అంశం సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మోడీ పర్యటనపై సమాచారం ఇచ్చారు. జులై 23 నుంచి 24 వరకు బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్తో చర్చలు జరుపుతారని చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్-3ని కలువనున్నట్లు చెప్పారు. భారత్, బ్రిటన్ రెండింటి బిజినెస్ లీడర్లతో చర్చలు జరిపే ప్రణాళిక సైతం ఉందన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై రెండు దేశాలు చర్చిస్తాయని, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక, ఆవిష్కరణ, భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం తదితర అంశాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. నరేంద్ర మోడీకి బ్రిటన్ పర్యటన నాలుగోది. జులై 24న భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.
ప్రధానితో కలిసి కేంద్రమంత్రి పీయూస్ గోయల్ సైతం లండన్కు వెళ్లనున్నారు. ఈ వాణిజ్య ఒప్పందంలో తోలు, బూట్లు, దుస్తులు తదితర ఉత్పత్తుల ఎగుమతులపై పన్నులను తొలగించాలని ప్రతిపాదించారు. అయితే, బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతుల విషయంలో పలు ప్రతిపాదనలు చేసింది. 36 బిలియన్ల ఎఫ్డీఐతో యూకే భారత్లో ఆరో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచింది. భారత్ దాదాపు 20 బిలియన్ల మొత్తం యూకేలో ప్రధానంగా పెట్టుబడి పెట్టింది. ఇండో-యూకే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి మోదీ సమగ్ర చర్చలు జరుపుతారని మిస్రి తెలిపారు. ఉగ్రవాదుల అప్పగింతపై సైతం చర్చలు జరుగనున్నట్లు తెలిపారు. బ్రిటన్ పర్యటన తర్వాత మోదీ 25-26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ మాల్దీవులకు వెళ్తున్నారు. ఆ దేశంలో మోడీ పర్యటించడం ఇది మూడోసారి. మోయిజు మాల్దీవులలో అధికారం చేపట్టిన తర్వాత ఒక విదేశీ దేశాధినేత తొలి పర్యటన ఇదే.