నవతెలంగాణ-హైదరాబాద్: కెనడా వేదికగా జరిగే జీ7 దేశాల కూటమి సమావేశానికి ప్రధాని మోడీకి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జూన్ 16-17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.
అంతేకాకుండా కెనడాతో పాటు ప్రధాని మోడీ సైప్రస్, క్రొయేషియా దేశాల్లో కూడా పర్యటిస్తారు.ఈ శిఖరాగ్ర సమావేశంలో, ఇంధన భద్రత, సాంకేతికత మరియు ఆవిష్కరణలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై భారతదేశం యొక్క వైఖరిని ప్రధాన మంత్రి భారత వైఖరి తెలియచేస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 15 నుంచి 16 వరకు మోడీ సైప్రస్ పర్యటనలో ఉంటారు. ఆ తర్వాత 16-17 వరకు జీ-7 సమావేశంలో పాల్గొంటారు. దీని తర్వాత జూన్ 18న క్రొయేషియాలో పర్యటిస్తారు.