– ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభ డిమాండ్
– కోజికోడ్ మహాసభలో పలు తీర్మానాలు ఆమోదం
కోజికోడ్: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) (2020) కు ప్రత్యామ్నాయంగా దేశంలో ప్రజానుకూల విధానం ఉద్భవించాలని ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభ తీర్మానం ద్వారా డిమాండ్ చేసింది. సమానత్వం, సామాజిక న్యాయం, శాస్త్రీయ కంటెంట్తో కూడిన ప్రత్యామ్నాయ విద్యా విధానం దేశంలో అమలులో ఉండాలని స్పష్టం చేసింది. కేరళలోని కోజికోడ్లో (పాలస్తీనా సాలిడారిటీ నగర్) నాలుగు రోజుల పాటు జరిగే ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభ రెండో రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ తీర్మానాలను మహాసభ ఆమోదించింది.
దేశంలోని విద్యార్థులందరినీ క్రమంగా చేర్చడానికి బదులుగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లోపభూయిష్టమైన, ప్రజావ్యతిరేక విధానాన్ని విధిస్తోందని విమర్శించింది. విద్య మతతత్వం, వాణిజ్యకరణ, కేంద్రీకరణపై దృష్టి సారించడంతో కేంద్రం విద్యను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నది. ప్రయివేటీకరణను ప్రోత్సహించడంతో విద్యను పూర్తిగా వాణిజ్యీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, విద్యా రంగంలో రాష్ట్రాల హక్కులను రాజ్యాంగ విరుద్ధంగా లాక్కొంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనుకబడిన, మైనారిటీ వర్గాల విద్యార్థులను వారి చదువుల నుంచి తొలగిస్తున్నారనీ, దేశంలోని ప్రభుత్వ విద్యా రంగంలో అవినీతిని వ్యాప్తి చేయడంతో విద్యా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మహాసభ విమర్శించింది. విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే, అణగారిన వర్గాలను విముక్తి చేసే కొత్త విధానం తీసుకురావాలని డిమాండ్ చేసింది. కార్పొరేట్ దురాశకు, నిరంకుశ భావజాలానికి లొంగకుండా, విద్యార్థులు అన్యాయాన్ని ప్రతిఘటించేలా శక్తివంతం చేసే ప్రజానుకూల విధా నాన్ని రూపొందించాలని మహాసభ పిలుపునిచ్చింది.
మనందరినీ పోరాట మార్గంలో నడిపించిన ఎస్ఎఫ్ఐ
మనందరినీ పోరాట మార్గంలో నడిపించినది ఎస్ఎఫ్ఐ అని సంఘం అఖిల భారత మాజీ నేతలు పేర్కొన్నారు. వారు పిడికిలి బిగించి మహాసభ వేదిక వద్దకు చేరుకున్నారు. వేలాది గొంతుల నుంచి రెడ్ సెల్యూట్ను అందుకున్నారు. ఉద్వేగ భరితమైన జ్ఞాపకాలతో మెట్లు ఎక్కారు. గత నాయకులు అత్యవసర పరిస్థితితో సహా చీకటి కాలంలో హింస, అణచివేత నుంచి బయటపడిన అనుభవాలతో కూడిన వారి పోరాటాలను కొత్త తరంతో పంచుకున్నప్పుడు ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభతో కలిసి నిర్వహించిన మాజీ నాయకుల సమావేశం ఉల్లాసమైన, ఆలోచనపరమైన చర్చకు వేదికైంది. ఎస్ఎఫ్ఐ మొదటి ప్రధాన కార్యదర్శి బిమాన్ బసు నుంచి గత మహాసభ వరకు ఉన్న అఖిల భారత మాజీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కేంద్ర కమిటీ సభ్యులు కూడా వచ్చారు. వయస్సు పరిమితులను మరచిపోయిన వారితో సహా చాలా మంది ప్రేక్షకులలో ఉన్నారు. హక్కుల కోసం పోరాటంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వేదికపై మాట్లాడిన ప్రతీ నాయకుడి మాటల్లో ప్రతినిధులు ఉద్యమ చరిత్రను విన్నారు.
అత్యవసర పరిస్థితిలో ఎస్ఎఫ్ఐ చేసిన పోరాటాలు, అన్యాయాలపై వైఖరి నాయకుల మాటలతో నిండిపో యాయి. ప్రతినిధులు నినాదాలతో నాటి అనుభవాలను స్వాగతించారు.ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విపి సాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాజీ అఖిల భారత నాయకులు ప్రకాశ్ కారత్, ఎం.ఎ బేబీ, ఎ. విజయరాఘవన్, నీలోత్పల్ బసు, వై.వెంకటేశ్వరరావు, కె.ఎన్ బాలగోపాల్, పి. కృష్ణ ప్రసాద్, ఆర్.అరుణ్ కుమార్, కెకె రాగేష్, పికె బిజు, వి. శివదాసన్, విక్రమ్ సింగ్తో పాటు ఇతరులు తమ అనుభవాలను పంచుకున్నారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిశ్వాస్ ఈ సభకు స్వాగతం పలికారు.