Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవృత్తిదారులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలి

వృత్తిదారులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలి

- Advertisement -

– మోడ్రన్‌ దోబీ ఘాట్లను నిర్మించాలి
– కరెంట్‌ బిల్లుల బకాయిలు విడుదల చేయాలి: రజక, క్షౌర వృత్తిదారుల మహాధర్నాలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

రజక, నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేసి మోడ్రన్‌ దోబీ ఘాట్లను నిర్మించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రజక, క్షౌర వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రజక, నాయీ బ్రాహ్మణ వృత్తిదారుల్లో సుమారు 1,12,586 మందికి జీవో నెంబర్‌ 2 ప్రకారం 2005 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయడం ద్వారా వారు ఉపాధి పొందుతున్నారన్నారు. అయితే, ఉచిత విద్యుత్‌ పథకానికి రజకులకు రూ.187 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు రూ.43 కోట్ల విద్యుత్‌ బిల్లులు బకాయిలు ఉన్నాయని, దాంతో విద్యుత్‌ శాఖ అధికారులు వృత్తిదారులే బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. కొన్నిచోట్ల కనెక్షన్లు కూడా తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. కరెంట్‌ బిల్లు చెల్లించకపోవడంతో అద్దె షాపుల యజమానులు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క వృత్తిదారుడికి రూ.60 నుంచి 70 వేల వరకు కరెంటు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయని, వాటికి వెంటనే ప్రభుత్వం బడ్జెట్‌ రిలీజ్‌ చేసి విద్యుత్‌ శాఖకు పూర్తిగా చెల్లించి జీరో బిల్లు అయ్యే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో మంజూరైన 141 మున్సిపల్‌ పట్టణాల్లో మోడ్రన్‌ దోబీఘాట్లను ప్రస్తుత ప్రభుత్వం ఆపేసిందని, వీటన్నింటినీ వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. ఉచిత కరెంట్‌ పెండింగ్‌ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించి కరెంటోళ్ల వేధింపులు ఆపాలన్నారు. రాజీవ్‌ యువ వికాస్‌ పథకంలో అర్హులైన రజక యువతకు ఇవ్వాల న్నారు. 50 ఏండ్లు నిండిన వృత్తిదారులందరికీ పెన్షన్‌ ఇవ్వాలన్నారు.
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. : కూనంనేని, కోదండరామ్‌
రజక, నాయీ బ్రాహ్మణ వృత్తిదారుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు తెలిపారు. సమస్యల పరిష్కా రానికి ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. బిల్లుల బకాయిలు విడుదలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనీ, మోడ్రన్‌ దోబీఘాట్ల నిర్మాణం కూడా ప్రారంభమయ్యే విధంగా చూస్తామని అన్నారు. వృత్తిదారుల కుటుంబాలకు బీమా పథకం ప్రవేశ పట్టడానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్‌ మాట్లాడుతూ.. రజక, నాయీ బ్రాహ్మణ వృత్తిదారులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని ఏ ప్రభుత్వం కూడా ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వీరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం తూట్లు.. : దాసోజు
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రజక, నాయీ బ్రాహ్మణ వృత్తిదారుల కోసం ప్రారంభించిన ఉచిత కరెంటు పథకానికి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. వెంటనే పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో అరుణోదయ విమలక్క, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎదునూరి మదర్‌, నాయకులు ఎం.బాలకృష్ణ, సి.మల్లేష్‌, ఎం.గోపాల్‌, జ్యోతి ఉపేందర్‌ ఏ.వెంకటస్వామి, క్షౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద విష్ణు, రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేశం, నాయకులు వేముల బిక్షం, మనోహర్‌, రాకేష్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -