నవతెలంగాణ-హైదరాబాద్: అశోకా యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్కి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్లను నిలిపివేయడానికి నిరాకరించింది. రాక్షసులు మన దేశంపై దాడి చేశారని, చవకబారు పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలు ఎందుకు చేపట్టారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం అలీఖాన్ను ప్రశ్నించింది. అలీఖాన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ అంశానికి సంబంధించి అలీఖాన్ ఆన్లైన్లో ఎలాంటి పోస్టులు చేయకూడదని ఆదేశించింది.
అలీఖాన్ సోషల్మీడియా పోస్ట్లోని పదాలను దర్యాప్తు చేయడానికి హర్యానాకు చెందిన ముగ్గురు ఐపిఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని హర్యానా పోలీసులను ఆదేశించింది. గురువారం నాటికి సిట్ను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో కొత్త ఎఫ్ఐఆర్లను స్వీకరించవద్దని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. అలీఖాన్ తన పాస్పోర్ట్ను సోనిపట్లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్కు అప్పగించాలని, రెండు ఎఫ్ఐఆర్లలో సాధారణ బెయిల్ బాండ్లను సమర్పించాలని కోరింది.