– 13న ట్రంప్ దిష్టిబొమ్మల దహనం
– రైతు సంఘం పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికా ఆంక్షలకు నిరసనగా ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి సాగర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంబంధిత వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రష్యాతో చమురు వాణిజ్య ఒప్పందానికి శిక్షగా మన దేశంపై 50శాతం సుంకాలను విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించటాన్ని ఖండించారు. స్వతంత్ర దేశాలను బెదిరించడానికి సుంకాలను ఆయుధంగా వాడుతున్నారని గుర్తు చేశారు. ఆ బెదిరింపు లకు సున్నితంగా మన ప్రభుత్వం లొంగిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇది సామ్రాజ్యవాద ప్రయోజనాలకు తలొగ్గడమేనని విమర్శించారు. భారత్ -యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంలో ఈ లొంగుబాటు మరింత స్పష్టంగా కనిపిస్తోందని గుర్తు చేశారు. బెదిరింపులను గట్టిగా తిరస్కరించే బదులు, కేంద్ర ప్రభుత్వం మౌనంగా స్పందించిందని తెలిపారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు దేశభక్తిగల పౌరులను ఈ నెల 13న జరిగే దేశవ్యాప్త ప్రతిఘటన దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, మాదినేని రమేష్, కందాల ప్రమీల, మధుసూదన్ రెడ్డి, వర్ణ వెంకట్ రెడ్డి, మాటూరు బాల్ రాజ్ గౌడ్, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, అన్నవరపు సత్యనారాయణ, ఎం శ్రీనివాస్, బాల్ రెడ్డి, శ్రీరాములు ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అమెరికా ఆంక్షలకు నిరసన
- Advertisement -
- Advertisement -