నవతెలంగాణ – హైదరాబాద్: పారిస్లో సోమవారం నాడు ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మైనపు విగ్రహాన్ని నిరసనకారులు ఎత్తుకుపోయారు. పర్యావరణ పరిరక్షణ సంస్థ గ్రీన్పీస్ కార్యకర్తలు ఒక ప్రఖ్యాత మ్యూజియం నుంచి మాక్రాన్ విగ్రహాన్ని అపహరించారు. రష్యా, ఫ్రాన్స్ మధ్య కొనసాగుతున్న ఆర్థిక, రాజకీయ సంబంధాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పారిస్లోని ప్రఖ్యాత గ్రెవిన్ మ్యూజియంలో ఈ ఘటన జరిగింది. పోలీసు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు సాధారణ పర్యాటకుల్లాగా మ్యూజియంలోకి ప్రవేశించారు. అనంతరం, అక్కడున్న అధ్యక్షుడు మాక్రాన్ మైనపు విగ్రహాన్ని తీసుకుని, మ్యూజియం అత్యవసర ద్వారం గుండా చాకచక్యంగా తప్పించుకున్నారు.
ఈ విగ్రహం విలువ సుమారు 40,000 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 36 లక్షలు) ఉంటుందని అంచనా. అపహరించిన ఈ విగ్రహాన్ని కార్యకర్తలు ఫ్రాన్స్లోని రష్యా రాయబార కార్యాలయం ఎదుట ఉంచి తమ నిరసనను తెలిపారు.ఈ ఘటనపై గ్రీన్పీస్ ఫ్రాన్స్ విభాగం అధిపతి జీన్-ఫ్రాంకోయిస్ జులియార్డ్ మాట్లాడుతూ, “మా దృష్టిలో, ఫ్రాన్స్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది” అని వివరించారు. “ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ద్వంద్వ ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు. ఆయన ఒకవైపు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు, కానీ మరోవైపు ఫ్రెంచ్ కంపెనీలు రష్యాతో వాణిజ్యం కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నారు” అని ఆయన తీవ్రంగా విమర్శించారు.