Saturday, June 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌తో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పించాలి

భారత్‌తో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పించాలి

- Advertisement -

– ట్రంప్‌ను కోరిన పాక్‌ నేతలు
ఇస్లామాబాద్‌:
భారత్‌, పాక్‌ల మధ్య ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలను నివారించడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పోషించిన పాత్రను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) చీఫ్‌ బిల్వాల్‌ భుట్టో జర్దారి ప్రశంసించారు. బుధవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో వారు వేర్వేరుగా ట్రంప్‌ను ప్రశంసించారు. భారత్‌తో సమగ్రంగా చర్చలు జరిపేందుకు అవకాశం కల్పించేలా చూడాల్సిందిగా వారు ట్రంప్‌ను కోరారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవడంపై కూడా వారు మాట్లాడారు. పాకిస్తాన్‌తో ఘర్షణలను నివారించేలా చూడడంలో తాను కీలకంగా వ్యవహరించానని ట్రంప్‌ పదేపదే చెప్పుకుంటుండగా, భారత్‌ ఆ వాదనలను నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తోంది. తమ రెండు దేశాలు ద్వైపాక్షికంగానే ఈ విషయాన్ని పరిష్కరించుకున్నాయి, తప్ప ట్రంప్‌ ప్రమేయం లేదని తేల్చి చెప్పింది, ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ నేతలు ట్రంప్‌ జోక్యాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇస్లామాబాద్‌లోని అమెరికన్‌ ఎంబసీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని షరీఫ్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలుచేయగా, పీపీపీ చీఫ్‌ బిల్వాల్‌ భుట్టో జర్దారి వాషింగ్టన్‌లో అమెరికాలోని పాక్‌ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ శాంతి కాముకుడని షరీఫ్‌ వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను, యుద్ధాలను నివారించే వ్యక్తి అని ప్రశంసించారు. గత నెల్లో భారత్‌, పాక్‌ల మద్య కాల్పుల విరమణకు వెసులుబాటు కల్పించిన ఘనత ట్రంప్‌కే దక్కుతుందని బిల్వాల్‌ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేయాలనుకుంటే భారత్‌తో చర్చలు జరిపే ఏర్పాటు చేయాలని బిల్వాల్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -