అమరావతికి రెండో విడత నిధులను
గ్రాంటుగా విడుదల చేయాలి
రెవెన్యూ లోటు భర్తీ వినతిని అంగీకరించాలి
సాస్కి కింద అదనంగా రూ.10 వేల కోట్లు కేటాయించాలి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. అమరావతికి రెండో విడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు భర్తీ వినతిని అంగీకరించాలని కోరారు. బుధవారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను సీఎం చంద్రబాబు లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. 2025-26 సంవత్సరానికి గాను సాస్కి కింద అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. 16వ ఆర్థిక సంఘానికి రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వినతిని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి రెండో విడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని అభ్యర్థించారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్ధిక వనరుల లోటును ఎదుర్కొంటోందని వివరించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సిఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు ఉన్నారు.
అమరావతిలో బ్యాడ్మింటన్, వాటర్ స్పోర్ట్స్ హబ్
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సిఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి గుర్తు చేశారు. నాగార్జునా యూనివర్శిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు అన్నారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం అభివృద్ధికి రూ. 27 కోట్లు, గుంటూరు విఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని అన్నారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఎపిలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు సిఎం వెల్లడించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఎపిలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన ఎంపీలు ఉన్నారు.
ఆర్థిక సహాయం చేయండి
- Advertisement -
- Advertisement -