నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తమ కొత్త మ్యాచ్ జెర్సీని గురువారం ఆవిష్కరించింది. ప్రత్యేకమైన ఎరుపు, నీలం రంగుల మేళవింపుతో ఈసారి సరికొత్త డిజైన్ను పరిచయం చేసింది. గత ఏడాది ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడి పంజాబ్ కింగ్స్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే.
భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోచ్గా ఉన్న ఈ జట్టు, కొత్త జెర్సీ డిజైన్ వెనుక ఉన్న స్ఫూర్తిని కూడా వివరించింది. జెర్సీ మధ్యలో సింహం బొమ్మ ఉంటుందని, అది క్రమంగా వజ్రాల ఆకృతులలోకి మారుతుందని ఫ్రాంచైజీ పేర్కొంది. “సింహం దూకుడు, ప్రతిభకు ప్రతీక అయితే… కఠోర శ్రమ, ఒత్తిడిలో రాటుదేలిన తర్వాత ఆ ప్రతిభ వజ్రంలా మారుతుందనడానికి ఈ డైమండ్స్ నిదర్శనం” అని తెలిపింది. మార్చి 31న న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగే తొలి మ్యాచ్లో పంజాబ్ ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది.



